ప్రోకబడ్డీ లీగ్ సీజన్-11 ఆసక్తికరంగా సాగుతోంది. నొయిడా వేదికగా ఆదివారం జరిగిన ఉత్కంఠ పోరులో బెంగాల్ వారియర్స్పై పట్నా పైరేట్స్ 38-35 తేడాతో నెగ్గింది. పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి ఎగబాకింది. ఈ సీజన్లో 15 మ్యాచ్లో ఆడిన పట్నాకు ఇది 9వ విజయం. మరోవైపు బెంగాల్కు ఇది వరుసగా తొమ్మిదో పరాజయం. 14 మ్యాచ్లు ఆడిన బెంగాల్ వారియర్స్ మూడింట్లో గెలిచి, రెండు మ్యాచ్లను టైగా ముగించి 10వ స్థానంలో నిలిచింది.
మ్యాచ్ ఆరంభం నుంచి పట్నా పైరేట్స్ దూకుడు ప్రదర్శించింది. తొలి అర్ధభాగం ముగిసేసరికి బెంగాల్పై 19-15తో నిలిచింది. అయితే రెండో అర్ధభాగంలో బెంగాల్ వారియన్స్ పుంజుకుంది. పట్నాను ఒక్కసారి ఆలౌట్ చేసింది. సెకండ్ హాఫ్లో ప్రత్యర్థి కంటే ఒక్క పాయింట్ పైచేయి సాధించింది. కానీ ఫస్ట్ హాఫ్లోని వెనుకంజతో బెంగాల్ మ్యాచ్ను కోల్పోయింది.

పట్నా పైరేట్స్లో దేవాంక్ 13, అయన్ 8 పాయింట్లు సాధించారు. బెంగాల్ వారియర్స్ జట్టులో మనీందర్ సింగ్ 11 పాయింట్లతో పోరాడాడు. ఆదివారం జరిగిన మరో మ్యాచ్లో తమిళ్ తలైవాస్పై దబాండ్ ఢిల్లీ 32-21 తేడాతో ఘన విజయం సాధించింది. 15 మ్యాచ్లు ఆడిన ఢిల్లీ ఏడో విజయంతో మూడో స్థానానికి ఎగబాకింది. మరోవైపు తొమ్మిదో స్థానంలో ఉన్న తమిళ్ తలైవాస్ 15 మ్యాచ్లు ఆడి తొమ్మిదో ఓటమి చవిచూసింది.
అయితే తొలి అర్ధభాగంలో ఇరు జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. 12-12 పాయింట్లతో తమిళ్ తలైవాస్-దబాంగ్ ఢిల్లీ సమంగా నిలిచాయి. కానీ రెండో అర్ధభాగంలో ఢిల్లీ ముందు తలైవాస్ నిలవలేకపోయింది. ఒక్కసారి ఆలౌటైంది. ఢిల్లీ రైడర్లు, డిఫెండర్లు విజృంభించారు. దబాంగ్ ఢిల్లీ జట్టులో నవీన్ కుమార్ (11 పాయింట్లు), తలైవాస్ జట్టులో మొయిన్ (8) టాప్ స్కోరర్లు. కాగా, ఇవాళ నొయిడా వేదికగా రాత్రి 8 గంటలకు బెంగళూరు బుల్స్తో గుజరాత్ జెయింట్స్, రాత్రి 9 గంటలకు యు ముంబాతో పుణెరి పల్టాన్ తలపడనున్నాయి.