ప్రో కబడ్డీ లీగ్ సీజన్-11లో ప్లే ఆఫ్స్ రేసు నుంచి తమిళ్ తలైవాస్ దాదాపుగా నిష్క్రమించింది. జైపుర్ పింక్ పాంథర్స్ చేతిలో ఓటమిపాలై ప్లే ఆఫ్స్ అవకాశాలను దూరం చేసుకుంది. ఈ సీజన్లో 19 మ్యాచ్లు ఆడిన తలైవాస్ ఆరు విజయాలు, 12 ఓటములు, ఒక మ్యాచ్ను టైగా ముగించి 40 పాయింట్లతో తొమ్మిదో స్థానంలో నిలించింది. ఈ క్రమంలో మిగిలిన మ్యాచ్ల్లో గెలిచినా తలైవాస్ ప్లేఆఫ్స్కు చేరలేదు.
మరోవైపు తమిళ్ తలైవాస్పై 34-27తో గెలిచిన జైపుర్ పింక్ పాంథర్స్ ప్లేఆఫ్స్ అవకాశాలు మెరుగుపర్చుకుంది. ప్రస్తుతం జైపుర్ ఏడో స్థానంలో కొనసాగుతోంది. 19 మ్యాచ్ల్లో 10 విజయాలు, 7 ఓటములు, రెండు మ్యాచ్లను టైగా ముగించింది. టాప్-6లో నిలిచిన జట్లు ప్లేఆఫ్స్కు అర్హత సాధిస్తాయి. కాగా, ఆరంభం నుంచే తలైవాస్పై జైపుర్ ఆధిపత్యం చెలాయించింది. 20-13తో ఫస్టాఫ్లో ఆధిక్యం సాధించింది.

రెండో అర్ధభాగంలో తమిళ్ తలైవాస్ పుంజుకున్నప్పటికీ లాభం లేకపోయింది. జైపుర్ పింక్ పాంథర్స్లో అర్జున్ దేశ్వాల్, నీరజ్ చెరో ఆరు పాయింట్లు సాధించారు. తమిళ్ జట్టులో హిమాన్షు, నితీశ్ చెరో ఏడు పాయింట్లు సాధించారు. పుణె వేదికగా జరిగిన మరో మ్యాచ్లో యు ముంబాపై యూపీ యోధాస్ 30-27 పాయింట్లతో విజయం సాధించింది. ఈ గెలుపుతో మూడో స్థానానికి ఎగబాకిన యూపీ ప్లేఆఫ్స్ అవకాశాలు మెరుగుపర్చుకుంది.
తొలి అర్ధభాగంలో ఇరు జట్లు హోరాహోరీగా పోటీపడ్డాయి. ముంబాపై యూపీ ఒక్క పాయింట్ ఆధిక్యంతో ఫస్టాఫ్ ముగించింది. ఉత్కంఠగా సాగిన రెండో అర్ధభాగంలో యూపీ తన ఆధిక్యాన్ని కాపాడుకుంటూ మ్యాచ్ను సొంతం చేసుకుంది. కాగా, ఇవాళ పుణె వేదికగా రాత్రి 8 గంటలకు దబాంగ్ ఢిల్లీతో బెంగాల్ వారియర్స్, రాత్రి 9 గంటలకు పట్నా పైరేట్స్తో పుణెరి పల్టాన్ తలపడనున్నాయి.