ప్రోకబడ్డీ లీగ్ సీజన్-11 ఆసక్తికరంగా సాగుతోంది. జైపుర్ పింక్ పాంథర్స్ తమ జోరును కొనసాగిస్తూ హ్యాట్రిక్ విజయాన్ని నమోదుచేసింది. నొయిడా వేదికగా ఆదివారం పుణెరి పల్టాన్తో జరిగిన ఉత్కంఠ పోరులో 30-28 తేడాతో గెలిచింది. పుణెరిని వెనక్కి నెట్టి రెండో స్థానానికి ఎగబాకింది. పాయింట్ల పట్టికలో హర్యానా, జైపుర్, పుణెరి పల్టాన్ టాప్-3లో ఉన్నాయి.
మ్యాచ్ ఆరంభం నుంచి జైపుర్ పింక్ పాంథర్స్ పైచేయి సాధించింది. తొలి అర్ధభాగంలో పుణెరి పల్టాన్ను ఒక్కసారి ఆలౌట్ చేసి 19-12తో ఆధిక్యంలో నిలిచింది. రైడింగ్, ట్యాకిల్తో సత్తాచాటింది. అయితే సెకండ్ హాఫ్లో అదే జోరును కొనసాగించలేకపోయింది. ప్రత్యర్థి ముందు నిలవలేక ఒక్కసారి ఆలౌట్ అయ్యింది. కానీ ఫస్ట్ హాఫ్లోని ఆధిక్యంతో విజయతీరాలకు చేరింది.

జైపుర్ పింక్ పాంథర్స్లో అర్జున్ దేశ్వాల్ 8 పాయింట్లు, అంకుశ్ 6 పాయింట్లతో సత్తాచాటారు. పుణెరి పల్టాన్ జట్టులో ఆకాశ్ 7 పాయింట్లతో పోరాడాడు. కాగా, నొయిడా వేదికగా ఆదివారం జరిగిన మరో మ్యాచ్లో 36-29 పాయింట్ల తేడాతో తమిళ్ తలైవాస్పై హర్యానా స్టీలర్స్ విజయం సాధించింది. తొలి అర్ధభాగంలో సత్తాచాటినప్పటికీ టేబుల్ టాపర్ ముందు తమిళ్ తలైవాస్ నిలవలేకపోయింది.
ఫస్ట్ హాఫ్లో తమిళ్ తలైవాస్ 17-14తో హర్యానాపై ఆధిక్యం సాధించింది. ప్రత్యర్థి జట్టును ఒక్కసారి ఆలౌట్ చేసింది. కానీ సెకండ్ హాఫ్లో దారుణంగా విఫలమైంది. రైడింగ్, ట్యాకిల్లో పేలవ ప్రదర్శన చేస్తూ పాయింట్లు సమర్పించుకుంది. హర్యానా జట్టులో వినయ్ 10, మహ్మద్రీజా 8 పాయింట్లతో సత్తాచాటారు. తమిళ్ తలైవాస్ జట్టులో మొయిన్ 7 పాయింట్లతో పోరాడాడు. కాగా, సోమవారం రాత్రి 8 గంటలకు హర్యానా స్టీలర్స్తో తెలుగు టైటాన్స్, రాత్రి 9 గంటలకు బెంగళూరు బుల్స్తో యు ముంబా తలపడనుంది.