ప్రో కబడ్డీ లీగ్ సీజన్-11 ఆసక్తికరంగా సాగుతోంది. పుణె వేదికగా మంగళవారం జరిగిన మ్యాచ్లో బెంగళూరు బుల్స్పై బెంగాల్ వారియర్స్ 44-29 తేడాతో ఘన విజయం సాధించింది. ఈ సీజన్లో ఇరు జట్లు చెరో 17 మ్యాచ్లు ఆడగా, బెంగాల్ అయిదో గెలుపుతో 10వ స్థానంలో ఉంది. మరోవైపు బెంగళూరు రెండు విజయాలు, 14 ఓటములతో బెంగళూరు టేబుల్లో అట్టడుగున నిలిచింది.
మ్యాచ్ ఆరంభం నుంచి బెంగళూరుపై బెంగాల్ ఆధిపత్యం చెలాయించింది. తొలి అర్ధభాగంలో బెంగళూరును ఒకసారి ఆలౌట్ చేసి 22-12తో 10 పాయింట్ల ఆధిక్యాన్ని సంపాదించింది. ట్యాకిల్లో బెంగాల్ దూకుడుగా పాయింట్లు సాధించింది. రెండో అర్ధభాగంలోనూ బెంగాల్ అదే జోరు ప్రదర్శించింది. బెంగళూరును మరోసారి ఆలౌట్ చేసి మ్యాచ్ను గెలిచింది.

బెంగాల్ వారియర్స్లో రైడర్లు విశ్వాస్ 14, ప్రణయ్ 9 పాయింట్లు, డిఫెండర్లు నితీశ్, ఫజెల్ చెరో 7 పాయింట్లతో అదరగొట్టారు. బెంగళూరు బుల్స్లో ప్రదీప్ నర్వాల్ 14 పాయింట్లతో పోరాడాడు. పుణె వేదికగా అంతముందు జరిగిన మరో మ్యాచ్లో గుజరాత్ జెయింట్స్పై జైపుర్ పింక్ పాంథర్స్ 42-29 తేడాతో ఘన విజయం సాధించింది. తొలి అర్ధభాగంలో గుజరాత్ను రెండు సార్లు ఆలౌట్ చేసి 27-16తో పైచేయి సాధించిన జైపుర్.. రెండో అర్ధభాగంలోనూ ఆధిక్యాన్ని కొనసాగిస్తూ నెగ్గింది.
జైపుర్ పింక్ పాంథర్స్లో అర్జున్ 13 పాయింట్లు, గుజరాత్ జెయింట్స్లో గుమాన్ సింగ్ 9 పాయింట్లతో టాప్ స్కోరర్లుగా నిలిచారు. 18 మ్యాచ్ల్లో ఆరు విజయాలతో జైపుర్ ఆరో స్థానంలో ఉంది. గుజరాత్ 5 విజయాలు, 11 ఓటములతో 11వ స్థానంలో నిలిచింది. కాగా, ఇవాళ పుణె వేదికగానే రాత్రి 8 గంటలకు హర్యానా స్టీలర్స్తో బెంగళూరు బుల్స్, రాత్రి 9 గంటలకు యు ముంబాతో తమిళ్ తలైవాస్ తలపడనున్నాయి.