ప్రోకబడ్డీ లీగ్ సీజన్-11లో టేబుల్ టాపర్గా కొనసాగుతున్న హర్యానా స్టీలర్స్ జోరు మీద ఉంది. హ్యాట్రిక్ విజయాలతో తన అగ్రస్థానాన్ని మరింత పదిలం చేసుకుంది. నొయిడా వేదికగా బుధవారం పుణెరి పల్టాన్తో జరిగిన మ్యాచ్లో హర్యానా 38-28 తేడాతో ఘన విజయం సాధించింది. ఈ సీజన్లో 14 మ్యాచ్లు ఆడిన హర్యానాకు ఇది 11వ విజయం. మరోవైపు అయిదో స్థానంలో ఉన్న పుణెరి జట్టుకు ఇది అయిదో ఓటమి.
మ్యాచ్ ఆరంభం నుంచే హర్యానా స్టీలర్స్ దూకుడుగా పాయింట్ల వేట మొదలుపెట్టింది. రైడింగ్తో పాటు ట్యాకిల్లో చెలరేగింది. పుణెరి పల్టాన్ను ఒకసారి ఆలౌట్ చేసి 22-14 పాయింట్లతో తొలి అర్ధభాగాన్ని ఆధిక్యంతో ముగించింది. రెండో అర్ధభాగంలోనే అదే జోరు ప్రదర్శించింది. ఆధిక్యాన్ని కాపాడుకుంటూ పాయింట్లు కొల్లగొట్టింది. లెఫ్ట్ రైడర్ శివమ్ పటారే 13 పాయింట్లతో సత్తాచాటాడు. పుణెరి జట్టులో కెప్టెన్ పంకజ్ మోహిత్ 11 పాయింట్లతో పోరాడాడు.

నొయిడా వేదికగా బుధవారం జరిగిన మరో మ్యాచ్లో బెంగాల్ వారియర్స్పై గుజరాత్ జెయింట్స్ 37-39 పాయింట్ల తేడాతో విజయం సాధించింది. ఆది నుంచి ఇరు జట్లు హోరాహోరీగా పోటీపడ్డాయి. తొలి అర్ధభాగంలో బెంగాల్ ఒక్క పాయింటుతో పైచేయి సాధించింది. గుజరాత్ను ఒకసారి ఆలౌట్ చేసి ఫస్టాఫ్లో 20-19తో ఆధిక్యంలో నిలిచింది. సెకండ్ హాఫ్ మరింత రసవత్తరంగా సాగింది. ఇరు జట్లు చెరోసారి ఆలౌట్ అయ్యాయి. అయితే రైడింగ్లో సత్తాచాటి గుజరాత్ విజయ తీరాలకు చేరింది.
గుజరాత్ జెయింట్స్లో కెప్టెన్ గుమాన్ సింగ్ 12 పాయింట్లతో సత్తాచాటాడు. బెంగాల్ వారియర్స్లో రైడర్ మణీందర్ సింగ్ 11 పాయింట్లతో పోరాడాడు. కాగా, ఇవాళ నొయిడా వేదికగా రాత్రి 8 గంటలకు యూపీ యోధాస్తో జైపుర్ పింక్ పాంథర్స్, రాత్రి 9 గంటలకు యూ ముంబాతో తెలుగు టైటాన్స్ తలపడనున్నాయి.