ప్రోకబడ్డీ లీగ్ సీజన్-11లో జోరు మీదున్న తెలుగు టైటాన్స్కు బ్రేక్ పడింది. హ్యాట్రిక్ విజయాల అనంతరం శనివారం ఓటమి చవిచూసింది. నొయిడా వేదికగా గుజరాత్ జెయింట్స్తో జరిగిన మ్యాచ్లో 31-28 పాయింట్ల తేడాతో పరాజయాన్ని చవిచూసింది. ఈ సీజన్లో 13 మ్యాచ్లు ఆడిన టైటాన్స్కు ఇది అయిదో ఓటమి. మిగిలిన ఎనిమిదింట్లో గెలిచి 43 పాయింట్లతో పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతోంది.
మరోవైపు 12 మ్యాచ్లు ఆడిన గుజరాత్ జెయింట్స్కు ఇది మూడో విజయం. 20 పాయింట్లతో ఆ జట్టు పట్టికలో 11వ స్థానంలో ఉంది. అయితే మ్యాచ్ ఆరంభంలో గుజరాత్పై తెలుగు టైటాన్స్దే పైచేయి. రైడర్లు విజృంభించడంతో తొలి అర్ధభాగాన్ని 17-15తో ఆధిక్యాన్ని సంపాదించింది. కానీ సెకండ్ హాఫ్లో అదే జోరును ప్రదర్శించలేకపోయింది. గుజరాత్ చేతిలో ఒక్కసారి ఆలౌటై పాయింట్లు సమర్పించుకుంది.

తెలుగు టైటాన్స్లో కెప్టెన్ విజయ్ మాలిక్ 15 పాయింట్లు, ఆశిష్ నర్వాల్ 7 పాయింట్లతో పోరాడారు. గుజరాత్ జెయింట్స్ జట్టులో పార్తీక్ దహియా 11 పాయింట్లతో విజయంలో కీలక పాత్ర పోషించాడు. నొయిడా వేదికగా శనివారం జరిగిన మరో మ్యాచ్లో జైపుర్ పింక్ పాంథర్స్పై హర్యానా స్టీలర్స్ 43-30 తేడాతో ఘన విజయం సాధించింది. ఆరంభం నుంచే పాయింట్ల వేట మొదలు పెట్టిన హర్యానా ఫస్టాఫ్ను 22-12తో భారీ ఆధిక్యం సాధించింది.
అదే జోరును రెండో అర్ధభాగంలోనూ ప్రదర్శించింది. జైపుర్ పింక్ పాంథర్స్ పుంజుకున్నప్పటికీ జైపుర్ ముందు నిలవలేకపోయింది. రైడర్లు వినయ్, శివమ్ చెరో 11 పాయింట్లతో విజయంలో కీలకపాత్ర పోషించారు. జైపుర్ జట్టులో కెప్టెన్ అర్జున్ దేశ్వాల్ 16 పాయింట్లతో పోరాడాడు. నొయిడా వేదికగా ఆదివారం రెండు మ్యాచ్లు జరగనున్నాయి. రాత్రి 8 గంటలకు పుణెరి పల్టాన్తో బెంగాల్ వారియర్స్, రాత్రి 9 గంటలకు పట్నా పైరేట్స్తో యూపీ యోధాస్ తలపడనున్నాయి.