ప్రోకబడ్డీ లీగ్ సీజన్-11 ఆసక్తికరంగా సాగుతోంది. ఆదివారం పుణె వేదికగా యు ముంబాతో జరిగిన మ్యాచ్లో గుజరాత్ జెయింట్స్ ఒక్క పాయింటు తేడాతో నెగ్గింది. హోరాహోరీగా సాగిన ఈ పోరులో 34-33 పాయింట్లతో గెలుపు తీరాలకు చేరింది. ఈ సీజన్లో 17 మ్యాచ్లు ఆడిన గుజరాత్కు అయిదో విజయం. పాయింట్ల పట్టికలో 10వ స్థానంలో కొనసాగుతోంది. మరోవైపు 4వ స్థానంలో ఉన్న యు ముంబాకు ఇది ఆరో పరాజయం. తొమ్మిది మ్యాచ్ల్లో గెలిచింది.
ఈ సీజన్లో 100వ మ్యాచ్ అయిన ఈ పోరులో ఇరు జట్లు ఆది నుంచే నువ్వానేనా అన్నట్లుగా తలపడ్డాయి. తొలి అర్ధభాగంలో యు ముంబాపై గుజరాత్ 16-15తో స్వల్ప ఆధిక్యంలో నిలిచింది. సెకండ్ హాఫ్ మరింత హోరాహోరీగా సాగింది. ఇరు జట్లు చెరోసారి ఆలౌటయ్యాయి. సమంగా పాయింట్లు సాధించాయి. ఫస్ట్ హాఫ్లోని ఒక్క పాయింటు ఆధిక్యం గుజరాత్ను గెలిపించింది. జెయింట్స్ జట్టులో గుమాన్ సింగ్, రాకేశ్ చెరో పది పాయింట్లు సాధించారు. యు ముంబాలో అజిత్ చౌహాన్ 14 పాయింట్లతో పోరాడాడు.

పుణె వేదికగా అంతకుముందు జరిగిన మరో మ్యాచ్లో జైపుర్ పింక్ పాంథర్స్పై పట్నా పైరేట్స్ 38-28 పాయింట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ఈ సీజన్లో 10వ విజయంతో రెండో స్థానంలో నిలిచింది. మరోవైపు జైపుర్ 8 విజయాలు, 7 ఓటములతో ఏడో స్థానంలో కొనసాగుతోంది. అయితే తొలి అర్ధభాగంలో జైపుర్ 12-18తో ఆధిక్యంలో నిలిచింది. పట్నాను ఒక్కసారి ఆలౌట్ చేసింది.
కానీ రెండో అర్ధభాగంలో జైపుర్ పోరాట పటిమ చూపించలేదు.పట్నా పైరేట్స్ దూకుడు ముందు నిలవలేకపోయింది. ఏకంగా రెండు సార్లు ఆలౌటై పాయింట్లు సమర్పించుకుంది. పట్నా జట్టులో దేవాంక్ 14 పాయింట్లతో సత్తాచాటాడు. జైపుర్ పింక్ పాంథర్స్లో అర్జున్ దేశ్వాల్ 7 పాయింట్లతో పోరాడాడు. కాగా, ఇవాళ రాత్రి 8 గంటలకు టేబుల్ టాపర్ హర్యానా స్టీలర్స్తో తెలుగు టైటాన్స్, రాత్రి 9 గంటలకు పుణెరి పల్టాన్తో దబాంగ్ ఢిల్లీ తలపడనున్నాయి.