ప్రోకబడ్డీ ప్రీమియర్ లీగ్(పీకేఎల్) సీజన్- 11లో దబాంగ్ ఢిల్లీ తిరిగి గెలుపు బాట పట్టింది. వరుసగా నాలుగు మ్యాచ్ల్లో పరాజయాన్ని చవిచూసిన తర్వాత ఢిల్లీ మళ్లీ గెలుపు రుచి చూసింది. హైదరాబాద్లోని గచ్చిబౌలి స్టేడియంలో గురువారం బెంగాల్ వారియర్స్తో జరిగిన మ్యాచ్లో 33-30 పాయింట్ల తేడాతో విజయం సాధించింది. ఈ సీజన్లో ఎనిమిది మ్యాచ్లు ఆడిన ఢిల్లీకి ఇది మూడో గెలుపు.
మ్యాచ్ ఆరంభం నుంచే ఢిల్లీ దబాంగ్ దూకుడుగా పాయింట్లు సాధించింది. తొలి అర్ధభాగం ముగిసేసరికి 19-12తో ఆధిక్యంలో నిలిచింది. బెంగాల్ వారియర్స్ను ఒకసారి ఆలౌట్ చేసింది. సెకండ్ హాఫ్లో ఢిల్లీ అదే జోరును కొనసాగించలేకపోయింది. బెంగాల్ ప్రతిఘటిస్తూ, పాయింట్లు కొల్లగొడుతూ రెండో అర్ధభాగంలోపైచేయి సాధించింది. అయితే ఫస్ట్ హాఫ్లో మిగిలిన ఆధిక్యం ఢిల్లీకి కలిసొచ్చింది. అంతిమంగా మూడు పాయింట్ల తేడాతో నెగ్గింది.

ఢిల్లీ దబాంగ్ కెప్టెన్ అషు మాలిక్ పది పాయింట్లు, రైడర్ వినయర్ ఎనిమిది, ఆల్రౌండర్ ఆరు పాయింట్లతో సత్తాచాటారు. బెంగాల్ వారియర్స్లో నితీన్ కుమార్ 15 పాయింట్లతో పోరాడాడు. గురువారం జరిగిన మరో మ్యాచ్లో గుజరాత్ జెయింట్స్పై హర్యానా స్టీలర్స్ 35-22తో ఘనవిజయం సాధించింది. ఆరు మ్యాచ్లు ఆడిన హర్యానాకు ఇది నాలుగో విజయం. గుజరాత్ను ఆలౌట్ చేసి ఫస్ట్ హాఫ్లో హర్యానా 18-13తో ఆధిక్యంలో నిలిచింది.
రెండో అర్ధభాగంలో హర్యానా మరింత చెలరేగింది. ప్రత్యర్థిపై పైచేయి సాధిస్తూ భారీ ఆధిక్యానికి దూసుకెళ్లింది. హర్యానా స్టీలర్స్లో వినయ్ 9 పాయింట్లు, మహ్మద్రీజా ఆరు పాయింట్లతో సత్తాచాటారు. గుజరాత్ జెయింట్స్లో గుమాన్ సింగ్ 11 పాయింట్లతో పోరాడాడు. కాగా, ఇవాళ రాత్రి 8 గంటలకు జైపుర్ పింక్ పాంథర్స్తో పాట్నా పైరేట్స్, రాత్రి 9 గంటలకు దబాంగ్ ఢిల్లీతో తమిళ్ తలైవాస్ తలపడనుంది.