ప్రోకబడ్డీ ప్రీమియర్ లీగ్(పీకేఎల్) సీజన్- 11 ఆసక్తికరంగా సాగుతోంది. హైదరాబాద్లోని గచ్చిబౌలి స్టేడియంలో శుక్రవారం జరిగిన హోరాహొరీ పోరులో జైపుర్ పింక్ పాంథర్స్పై పట్నా పైరేట్స్ 43-41 తేడాతో విజయం సాధించింది. ఈ సీజన్లో ఏడు మ్యాచ్లు ఆడిన పట్నాకు ఇది నాలుగో విజయం. మరోవైపు జైపుర్కు ఇది మూడో ఓటమి.
మ్యాచ్ ఆరంభం నుంచే జైపుర్-పట్నా హోరాహోరీగా పోటీపడ్డాయి. ఇరు జట్లు ప్రత్యర్థిని చెరోసారి ఆలౌట్ చేశాయి. అయితే తొలి అర్ధభాగం ముగిసేసరికి పట్నా నాలుగు పాయింట్ల ఆధిక్యంతో 25-21తో నిలిచింది. సెకండ్ హాఫ్లో జైపుర్ పింక్ పాంథర్స్ కాస్త పైచేయి సాధించింది. రైడింగ్, ట్యాకిల్లో సత్తాచాటి పట్నా పైరేట్స్ను మరోసారి ఆలౌట్ చేసింది. అయితే అంతిమంగా విజయానికి రెండు పాయింట్ల దూరంలో నిలిచిపోయింది.

పట్నా పైరేట్స్లో అయాన్ 14 పాయింట్లు, దేవాంక్ 11 పాయింట్లతో సత్తాచాటారు. జైపుర్ పింక్ పాంథర్స్లో కెప్టెన్ అర్జున్ దేశ్వాల్ 20 పాయింట్లతో పోరాడాడు. కాగా, అంతకుముందు జరిగిన మరో మ్యాచ్లో తమిళ్ తలైవాస్పై దబాంగ్ ఢిల్లీ 39-26తో ఘన విజయం సాధించింది. నాలుగు మ్యాచ్ల్లో వరుస ఓటముల అనంతరం గురువారం గెలుపు బాట పట్టిన ఢిల్లీ మరో మ్యాచ్లో నెగ్గింది.
ఆది నుంచే తమిళ్ తలైవాస్పై ఢిల్లీ పైచేయి సాధించింది. ఫస్ట్ హాఫ్ ముగిసేసరికి 16-10తో ఆధిక్యంలో నిలిచింది. సెకండ్ హాఫ్లో మరింత జోరు పెంచింది. ప్రత్యర్థి జట్టును ఒకసారి ఆలౌట్ చేసి భారీ తేడాతో విజయాన్ని అందుకుంది. అషు మాలిక్ 12 పాయింట్లతో విజయంలో కీలకపాత్ర పోషించాడు. తమిళ్ జట్టులో నరేందర్ (6) టాప్ స్కోరర్. కాగా, ఇవాళ రాత్రి 8 గంటలకు పుణెరి పల్టాన్తో తెలుగు టైటాన్స్, రాత్రి 9 గంటలకు బెంగళూరు బుల్స్తో బెంగాల్ వారియర్స్ తలపడనుంది.