
ఢిల్లీ: ప్రొ కబడ్డీ లీగ్-7లో హరియాణా స్టీలర్స్ జోరు కొనసాగుతోంది. రైడర్లు వికాస్ ఖండోలా (11), వినయ్ (9) చెలరేగడంతో సోమవారం జరిగిన మ్యాచ్లో హరియాణా 36-33 తేడాతో బెంగాల్ వారియర్స్ను కంగుతినిపించింది. వారియర్స్ రైడర్ మణీందర్ సింగ్ 15 పాయింట్లతో టాప్ స్కోరర్గా నిలిచినా జట్టుకు విజయాన్ని అందించలేకపోయాడు. రైడింగ్లో ఇరు జట్లు సమ ఉజ్జీలుగా నిలిచినా.. ట్యాక్లింగ్లో కాస్త ఆధిపత్యం కనబర్చిన హరియాణా విజయం సాధించింది. హరియాణాకు ఇది వరుసగా రెండో విజయం.
మ్యాచ్ ఆరంభంలో బెంగాల్ పూర్తి ఆధిపత్యం చలాయించింది. అద్భుత ఫామ్లో ఉన్న మణిందర్ సింగ్ మరోసారి విరుచుకుపడడంతో తొలి పది నిమిషాలు ముగిసే సరికి హరియాణాను ఆలౌట్ చేసిన వారియర్స్ 14-10తో ఆధిక్యం సంపాదించింది. ఈ సమయంలో రైడర్లు వికాస్, వినయ్ సత్తాచాటడంతో హరియాణా తిరిగి పుంజుకుంది. దీంతో హరియాణా తొలి అర్ధభాగాన్ని 18-17తో ముగించింది.
విరామం తర్వాత ఆట ఆరంభం కాగానే వారియర్స్ను ఆలౌట్ చేసిన హరియాణా 22-18తో ఆధిక్యంతో నిలిచింది. అక్కడి నుంచి హరియాణా దూకుడు ఏ మాత్రం తగ్గలేదు. ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెడుతూ.. పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. వికాస్ పాయింట్లు తేవడంతో హరియాణా ఆధిక్యాన్ని పెంచుకుంటూ వెళ్లింది. మరోవైపు మణిందర్తో పాటు ప్రపంజన్ (7) పోరాడినా.. హరియాణా దూకుడును అందుకోలేకపోయారు. ఓ దశలో 29-25తో నిలిచిన హరియాణా.. మరో రెండు నిమిషాల్లో మ్యాచ్ ముగుస్తుందనగా 36-31తో నిలిచింది. చివరలో వారియర్స్ రెండు పాయింట్లు మాత్రమే చేయడంతో మూడు పాయింట్ల తేడాతో ఒడి[పోయింది.