
ఢిల్లీ: ప్రొ కబడ్డీ ఏడో సీజన్లో భాగంగా ఢిల్లీలోని త్యాగరాజ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్లో సోమవారం రాత్రి జరిగిన మ్యాచ్లో యూపీ యోధ 35-30తో పుణెరి పల్టాన్ను ఓడించింది. యూపీ రైడర్ శ్రీకాంత్ జాదవ్ 15 రైడ్ పాయింట్లతో అదరగొట్టాడు. పల్టాన్ తరఫున మంజీత్ 16 పాయింట్లతో మెరిశాడు. యూపీ డిఫెండర్ సుమిత్ హై 5తో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. యూపీకి ఇది నాలుగో విజయం. యూపీ ప్రస్తుతం 27 పాయింట్లతో ఏడవ స్థానంలో కొనసాగుతోంది. పల్టాన్ 11వ స్థానంలో ఉంది.
మ్యాచ్ ఆరంభంలో ఏ జట్టు కూడా పెద్ద ఆధిక్యాన్ని సాధించలేకపోయింది. ఈ సమయంలో జాదవ్ పాయింట్లు తేవడంతో 13వ నిమిషంలో పల్టాన్ ఆలౌట్ అయింది. దీంతో యూపీ 12-6 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఇదే ఊపులో యూపీ తొలి అర్ధ భాగాన్ని 16-9తో ముగించింది. రెండో అర్ధ భాగంలో పల్టాన్ రైడర్ మంజీత్ పుంజుకోవడంతో 28-17తో ఆధిక్యాన్ని తగ్గించుకుంది. మరోవైపు జాదవ్ చెలరేగడంతో 31 నిమిషంలో యూపీ 11 పాయింట్ల ఆధిక్యంలో నిలిచింది. పాల్టాన్ ఆలస్యంగా పుంజుకోవడంతో యూపీ విజయం సాధించింది.
రైడర్లు వికాస్ ఖండోలా (11), వినయ్ (9) చెలరేగడంతో సోమవారం జరిగిన మరో మ్యాచ్లో హరియాణా 36-33 తేడాతో బెంగాల్ వారియర్స్ను కంగుతినిపించింది. వారియర్స్ రైడర్ మణీందర్ సింగ్ 15 పాయింట్లతో టాప్ స్కోరర్గా నిలిచినా జట్టుకు విజయాన్ని అందించలేకపోయాడు. రైడింగ్లో ఇరు జట్లు సమ ఉజ్జీలుగా నిలిచినా.. ట్యాక్లింగ్లో కాస్త ఆధిపత్యం కనబర్చిన హరియాణా విజయం సాధించింది. నేడు ప్రొ కబడ్డీ లీగ్లో విశ్రాంతి దినం. బుధవారం జరిగే మ్యాచ్ల్లో గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్తో హరియాణా స్టీలర్స్; యు ముంబాతో దబంగ్ ఢిల్లీ తలపడతాయి.