
కోల్కతా: ప్రొ కబడ్డీ లీగ్ సీజన్-7లో యూపీ యోధ జైత్రయాత్ర కొనసాగుతోంది. తాజా విజయంతో యూపీ వరుసగా నాలుగో విజయాన్ని నమోదు చేసింది. కోల్కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇండోర్ స్టేడియంలో సోమవారం జరిగిన మ్యాచ్లో యూపీ యోధ 33-26తో గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్పై విజయం సాధించింది. ఈ విజయం తరువాత సీజన్ 7 స్టాండింగ్స్లో యోధ ఐదో స్థానానికి చేరుకుంది. శ్రీకాంత్ జాదవ్ 6 రైడ్ పాయింట్లతో సత్తా చాటగా.. సుమిత్ హై5 నమోదు చేసాడు.
మ్యాచ్ ఆరంభంలో పాయింట్లు రావడం కష్టం అయింది. మొదటి అర్ధభాగంలో రెండు జట్ల డిఫెండర్లు ఆధిపత్యం చెలాయించారు. అనంతరం రైడర్స్ మ్యాచ్లో పట్టు సాధించారు. శ్రీకాంత్ పాయింట్లు తేవడంతో యూపీ 6-5 ఆధిక్యంలోకి వెళ్ళింది. ఇక సురేందర్ గిల్, రిషంక్ దేవడిగా రెచ్చిపోవడంతో యూపీ 16-9తో తొలి అర్ధ భాగాన్ని ముగించింది. విరామం అనంతరం గుజరాత్ ఆలౌట్ అవ్వడంతో యూపీ 24-12తో నిలిచింది. ఈ సమయంలో రైడర్ సచిన్ తన్వర్ సూపర్ టెన్తో గుజరాత్ 25-21తో పుంజుకుంది. అయితే అవకాశం ఇవ్వని యూపీ చివరి వరకు ఆధిక్యాన్ని పెంచుకుని 7 పాయింట్లతో అలవోక విజయాన్ని అందుకుంది. గుజరాత్ రైడర్ సచిన్ సూపర్ టెన్తో రాణించినా.. జట్టుకు విజయాన్ని మాత్రం అందించలేకపోయాడు.
సోమవారం జరిగిన మరో మ్యాచ్లో స్టార్ రైడర్, డుబ్కీ కింగ్ పర్దీప్ నర్వాల్ 26 పాయింట్లతో విశ్వరూపం ప్రదర్శించడంతో పాట్నా పైరేట్స్ 51-25తో తమిళ్ తలైవాస్పై ఘనవిజయం సాధించింది. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉన్న పట్నా సూపర్ విక్టరీని నమోదు చేసింది. తలైవాస్ తరఫున రాహుల్ చౌదరి (5 పాయింట్లు) పెద్దగా ఆకట్టుకోలేకపోగా.. అజిత్ కుమార్ (10 పాయింట్లు) సూపర్-10 సాధించాడు. పట్నా సాధించిన మొత్తం పాయింట్లల్లో పర్దీప్ సాధించిన పాయింట్లు సగం ఉండటం విశేషం. అంతే కాకుండా ప్రత్యర్థి సాధించిన పాయింట్ల కంటే ప్రదీప్ సాధించిన పాయింట్లే ఎక్కువ.