
బెంగళూరు: యూపీ యోధా డిఫెండర్లు అదరగొట్టడంతో ప్రొ కబడ్డీ-7లో మరో విజయాన్ని అందుకుంది. ఆదివారం జరిగిన హోరాహోరీ మ్యాచ్లో యూపీ జట్టు 32-29తో బెంగాల్ వారియర్స్ను చిత్తు చేసింది. యూపీ డిఫెండర్, కెప్టెన్ నితీష్ కుమార్ 'హై 5'సహా ఏడు పాయింట్లతో సత్తా చాటాడు. రైడర్ శ్రీకాంత్ జాదవ్ (9) పాయింట్లు సాధించాడు. బెంగాల్ తరపున మొహ్మద్ (6), బల్దేవ్ సింగ్ (5) రాణించారు.
మ్యాచ్ ఆరంభం నుండే బెంగాల్ దూకుసు ప్రదర్శించింది. ఆల్రౌండ్ ప్రదర్శనతో తొలి 6 నిమిషాల్లోనే 6-2తో ఆధిక్యం సంపాదించింది. ఈ సమయంలో నితీష్ సూపర్ టాకిల్ చేయడంతో యూపీ ఓ దశలో 6-7తో నిలిచింది. ఇక్కడి నుండి ఇరు జట్లు పాయింట్ల కోసం పోటీపడ్డాయి. దీంతో స్కోర్ 9-9తో సమం అయింది. ఇక తొలి అధ భాగం ముగిసేసరికి బెంగాల్ 14-13తో స్వల్ప ఆధిక్యంలో నిలిచింది. విరామం తర్వాత శ్రీకాంత్ చెలరేగడంతో యూపీ దూసుకెళ్లింది. బెంగాల్ రైడర్ మొహ్మద్ పాయింట్లు సాధించినా.. చివరి రెండు నిముషాలు ఉందనగా యూపీ 31-27తో నిలిచింది. చివరకు కూడా సత్తా చాటలేక బెంగాల్ ఓడిపోయింది. ఈ విజయంతో యూపీ పాయింట్ల పట్టికలో 7వ స్థానంలో నిలిచింది.
సొంతగడ్డపై ఆడిన తొలి మ్యాచ్లో ఓడిన బెంగళూరు బుల్స్.. రెండో మ్యాచ్లో సత్తాచాటింది. ఆదివారం జరిగిన మరో మ్యాచ్లో బుల్స్ 33-27తో తమిళ్ తలైవాస్పై విజయం సాధించింది. బుల్స్ స్టార్ రైడర్ పవన్ షెరావత్ (17 పాయింట్లు) జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇక అమిత్ ట్యాక్లింగ్లో హైఫై సాధించాడు. తలైవాస్ తరఫున రాహుల్ చౌదరి (8 పాయింట్లు), అజయ్ ఠాకూర్ (4 పాయింట్లు) రాణించారు. ఈ విజయంతో బెంగళూరు పాయింట్ల పట్టికలో 3వ స్థానంలో నిలిచింది. ఢిల్లీ మొదటి స్థానంలో ఉంది. బెంగాల్ తర్వాతి స్థానంలో ఉంది.