
ఢిల్లీ: ప్రొ కబడ్డీ లీగ్-7లో భాగంగా ప్రస్తుతం మ్యాచ్లు ఢిల్లీ అంచెలో జరుగుతున్నాయి. జూలై 20న ఆరంభమైన ఈ సీజన్లో మొత్తం 12 జట్లు పోటీపడుతున్నాయి. ప్రస్తుతం దబాంగ్ ఢిల్లీ 44 పాయింట్లతో టేబుల్ టాపర్గా నిలిచింది. తాజా విజయంతో 39 పాయింట్లతో బెంగాల్ వారియర్స్ రెండో స్థానంలోకి దూసుకొచ్చింది. 37 పాయింట్లతో జైపూర్ పింక్ పాంథర్స్ మూడో స్థానంలో.. 36 పాయింట్లతో హరియాణా స్టీలర్స్ నాలుగో స్థానంలో కొనసాగుతున్నాయి.
వరుస పరాజయాలతో సతమవుతున్న తెలుగు టైటాన్స్ మాత్రం 23 పాయింట్లతో 10వ స్థానంలో కొనసాగుతోంది. టైటాన్స్ ఇప్పటివరకు 10 మ్యాచులు ఆడగా.. మూడు విజయాలు, ఐదు ఓటములు, రెండు టైలను నమోదు చేసింది. ఇప్పటికే చాలా మ్యాచులు పూర్తయిన నేపథ్యంలో పుంజుకోవాల్సిన అవసరం ఉంది. ప్లే ఆఫ్ చేరాలంటే లీగ్ దశ ముగిసే సరికి టాప్-6లో చోటు దక్కించుకొవాలి. టాప్ జట్లను కాకుండా.. బెంగళూరు, యూపీ, ముంబా, తలైవాస్, గుజరాత్ జట్లను కాదని ప్లే ఆఫ్ చేరాలంటే టైటాన్స్ కష్టపడాల్సిందే. ఈ రోజు పునేరి పాల్టాన్ను టైటాన్స్ ఢీ కొట్టనుంది. పాయింట్ల పట్టికలో తమ కంటే దిగువన ఉన్న పాల్టాన్ను టైటాన్స్ టార్గెట్ చేసింది. పాల్టాన్ను ఓడించి విజయాల బాట పట్టాలని టైటాన్స్ భావిస్తోంది.
కబడ్డీ 'బాహుబలి' సిద్దార్థ్ దేశాయ్ పూర్తిగా విఫలమవడంతో టైటాన్స్ కోలుకోలేకపోతుంది. కెప్టెన్ అబోజెర్ కూడా సత్తా చాటలేకపోతున్నాడు. సూరజ్ దేశాయ్, అమిత్ కుమార్, విశాల్ భరద్వాజ్, రాకేష్ గౌడ ఇప్పటికైనా రాణించాల్సిన అవసరం ఉంది. అందరూ సమిష్టిగా రాణిస్తేనే జట్టు విజయాల బాట పడుతుంది. టోర్నీలో మొత్తం 12 జట్లు పోటీపడుతుండగా.. డబుల్ రౌండ్ రాబిన్ పద్ధతిలో లీగ్ దశ మ్యాచ్లు జరుగుతున్నాయి. లీగ్ దశలో ఒక్కో జట్టు మిగిలిన జట్లతో రెండేసి మ్యాచ్లను ఆడనుంది. ఇలా లీగ్ దశ పూర్తయ్యేసరికి మొత్తం 137 మ్యాచ్లు జరుగుతాయి.