
కోల్కతా: ప్రొ కబడ్డీ లీగ్ ఏడో సీజన్లో టేబుల్ టాపర్, వరుస విజయాలతో దూసుకెళ్తున్న దబంగ్ ఢిల్లీకి హర్యానా స్టీలర్స్ షాక్ ఇచ్చింది. ప్రొ కబడ్డీ లీగ్లో శనివారం జరిగిన మ్యాచ్లో హరియాణా స్టీలర్స్ 47-25తో దబాంగ్ ఢిల్లీని చిత్తు చేసింది. హరియాణా రైడర్లు వికాస్ ఖండోలా, ప్రశాంత్ కుమార్ చెరో సూపర్-10తో రాణించగా.. డిఫెన్స్లో వికాస్ కాలే 5 పాయింట్లతో సత్తా చాటారు. ఢిల్లీ తరఫున నవీన్ కుమార్ 11 పాయింట్లతో టాప్ స్కోరర్గా నిలిచాడు.
రైడింగ్లోహర్యానాకు కాస్త పోటీనిచ్చిన ఢిల్లీ.. ట్యాక్లింగ్లో ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయింది. హర్యానా తరఫున ప్రశాంత్ (10 పాయింట్లు) సూపర్-10 నమోదు చేసాడు. నవీన్ ఒంటరి పోరాటం చేసినా జట్టును ఆదుకోలేకపోయాడు. లీగ్లో భాగంగా ఇప్పటివరకు 13 మ్యాచ్లు ఆడిన ఢిల్లీకి ఇది రెండో పరాజయం. 10 విజయాలు, ఒక టైతో మొత్తం 54 పాయింట్లుతో ఢిల్లీ ప్రస్తుతం పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది.
శనివారం జరిగిన మరో మ్యాచ్ ఫలితం తేలకుండానే ముగిసింది. బెంగాల్ వారియర్స్, గుజరాత్ ఫార్చ్యూన్ జెయింట్స్ మధ్య ఉత్కంఠభరితంగా సాగిన పోరు చివరకు 25-25తో టై అయింది. బెంగాల్ జట్టులో మణిందర్ సింగ్ (9).. గుజరాత్ తరపున సచిన్ (6), సోను (6) రాణించారు. మ్యాచ్ ఆరంభం నుండే ఇరు జట్లు పాయింట్ల కోసం పోటీ పడడంతో ఆధిక్యం మారుతూ వచ్చింది. చివరకు తొలి అర్ధభాగాన్ని బెంగాల్ 15-13తో ముగించింది. విరామం అనంతరం ఇరు జట్లు పోటాపోటీగా ఆడాయి. చివరి రెండు నిమిషాలు ఉందనగా.. గుజరాత్ 24-22తో నిలిచింది. ఈ సమయంలో మణిందర్ చెలరేగడంతో 25-25తో సమం అయింది. చివరి రైడ్ లో గుజరాత్ విఫలమవడంతో మ్యాచ్ టై అయింది.