
చెన్నై: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) ఏడో సీజన్లో డిఫెండింగ్ ఛాంపియన్స్ బెంగళూరు బుల్స్కు షాక్ తగిలింది. ట్యాక్లింగ్లో సుర్జీత్ సింగ్ చెలరేగడంతో బుధవారం జరిగిన మ్యాచ్లో పుణెరి పల్టాన్ 31-23 తేడాతో బెంగళూరుపై విజయం సాధించింది. సుర్జీత్ డిఫెన్స్ వ్యూహాల ముందు బుల్స్ స్టార్ రైడర్ పవన్ కుమార్ శెరావత్ ఆటలు సాగలేదు.
బుల్స్లో ఇద్దరు స్టార్ రైడర్లు రోహిత్ కుమార్, పవన్ శెరావత్ ఉన్న కారణంగా పల్టాన్ కోచ్ అనూప్ కుమార్ జట్టులో మార్పులు చేసి డిఫెండర్ సాగర్ కృష్ణను తీసుకున్నాడు. ఈ వ్యూహం ఫలించింది. రెండు జట్లు హోరాహోరీగా తలపడడంతో మ్యాచ్ పోటాపోటీగా ప్రారంభం అయింది. ఇరు జట్ల ఆటగాళ్లు పాయింట్ల కోసం తీవ్రంగా పోరాడారు. పల్టాన్ రైడర్ నితిన్ తోమర్.. బుల్స్ రైడర్లు పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. ఇరు జట్లలో ఢిఫెన్స్ బలంగా ఉండడంతో పాయింట్లు రావడం కష్టంగా మారింది. దీంతో రెండు జట్లు తొలి అర్ధభాగాన్ని 10-10తో ముగించాయి.
ద్వితీయార్థంలో పుణెరి పుంజుకుంది. బుల్స్ రైడర్లు రోహిత్, పవన్లకు ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. ముఖ్యంగా పవన్ (5)ను లక్ష్యంగా చేసుకొన్న పుణెరి డిఫెండర్లు అతణ్ని కట్టడి చేశారు. ట్యాక్లింగ్లో సుర్జీత్ అదరగొట్టడంతో 26వ నిమిషంలో బుల్స్ను ఆలౌట్ చేసిన పుణెరి 19-11తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. అనంతరం పల్టాన్ దూకుడు తగ్గలేదు. క్రమంగా పాయింట్లు సాధిస్తూ ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. మరో మూడు నిమిషాల్లో మ్యాచ్ ముగుస్తుందనగా 28-18తో ఆధిక్యంలో నిలిచిన పల్టాన్.. అదే జోరుతో మ్యాచ్ను కైవసం చేసుకుంది. జాదవ్ (5) మంజీత్ (7) కూడా మెరిశారు.