
పాట్నా: ప్రొ కబడ్డీ లీగ్ ఏడవ సీజన్లో ఎట్టకేలకు పుణేరి పల్టన్ బోణీ కొట్టింది. ఆదివారం పాట్నా పైరెట్స్తో జరిగిన మ్యాచ్లో 41-20తో పల్టన్ భారీ విజయం సాధించింది. పల్టన్ తరపున పంకజ్ మోహితే 8 రైడ్ పాయింట్ల సాధించగా.. అమిత్ కుమార్ 4 ట్యాకిల్ పాయింట్లు సాధించాడు. పాట్నా తరఫున స్టార్ రైడర్ పర్దీప్ నర్వాల్ 6 రైడ్ పాయింట్లు ఖాతాలో వేసుకున్నాడు. మ్యాచ్ ఆరంభం నుంచి దూకుడు ప్రదర్శించిన పల్టన్.. పాట్నాకు ఏ మాత్రం అవకాశమివ్వలేదు.
ఒక్కపాయింట్ ఇవ్వకుండా కేవలం ఐదు నిమిషాల్లోనే పైరెట్స్ను ఆలౌట్ చేసి 10-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. పదో నిమిషంలో పాట్నా ఖాతా తెరువగా.. అప్పటికే పల్టన్ 14 పాయింట్లు సాధించింది. తొలి అర్ధభాగం ముగిసే సరికి పల్టన్ 20-10తో భారీ ఆధిక్యంలో నిలిచింది. రెండో అర్ధ భాగంలోనూ పల్టన్ వరుస పాయింట్లు సాధిస్తూ దూసుకెళ్లింది. రైడింగ్, ట్యాక్లింగ్లో అద్భుతంగా ఆడి 41-20 తేడాతో విజయం సాధించింది.
ఆదివారమే జరిగిన మరో మ్యాచ్లో తమిళ్ తలైవాస్ 35-28తో హర్యానా స్టీలర్స్పై గెలిచింది. స్టార్ రైడర్ రాహుల్ చౌదరి (14) సూపర్-10తో విజృంభించడంతో తలైవాస్ అనూహ్య విజయం సాధించింది. ఆరంభంలో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన హర్యానా 19-10తో తొలి అర్ధభాగంను ముగించింది. రెండో అర్ధభాగంలో రాహుల్ వరుస పాయింట్లతో మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. ఇక 25వ నిమిషంలో హర్యానాను ఆలౌట్ చేయడంతో 19-22తో పుంజుకుంది. మరో 4 నిమిషాల తర్వాత స్కోర్ 24-24తో స్కోరు సమం అయింది. ఆ తర్వాత హర్యానాను మరోసారి ఆలౌట్ చేసి అదే జోరులో తలైవాస్ మ్యాచ్ను సొంతం చేసుకుంది.