ఇప్పటికైనా టైటాన్స్ పుంజుకుంటే:
తెలుగు టైటాన్స్ ఇప్పటి వరకూ 9 మ్యాచ్లు ఆడి కేవలం రెండు విజయాలు నమోదు చేసింది. ఐదు పరాజయాలు, రెండు డ్రాలతో పట్టికలో 10వ స్థానంలో ఉంది. ప్రస్తుతం టైటాన్స్ ఖాతాలో 18 పాయింట్లు ఉన్నాయి. జైపూర్ పింక్ పాంథర్స్ ఖాతాలో 31 పాయింట్లు ఉన్నాయి. టాప్-6లో చోటు దక్కించుకోవాలంటే టైటాన్స్ గట్టిగా పోరాడాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైనా టైటాన్స్ పుంజుకుంటే ప్లేఆఫ్కి అర్హత సాధించొచ్చు. ఒక్క మ్యాచులో సత్తా చాటిన సిద్దార్థ్ దేశాయ్ చెలరేగాల్సిన సమయం ఆసన్నమైంది.
తొలి స్థానంలో జైపూర్:
జులై 20న ఆరంభమైన సీజన్-7లో మొత్తం 12 జట్లు పోటీపడుతుంన్నాయి. ఇప్పటికే 50 మ్యాచ్లు పూర్తయ్యాయి. దబాంగ్ ఢిల్లీ ఒక్క జట్టే 7 మ్యాచ్లు ఆడగా.. మిగతా అన్ని జట్లూ కనీసం ఎనమిది మ్యాచ్లు ఆడాయి. ఎనమిది మ్యాచ్లు ఆడిన జైపూర్ పింక్ పాంథర్స్ ఆరు విజయాలతో పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో కొనసాగుతోంది. దబాంగ్ ఢిల్లీ, బెంగాల్ వారియర్స్ రెండు మూడు స్థానాల్లో ఉన్నాయి. లీగ్ దశ ముగిసే సరికి టాప్-6లో నిలిచిన జట్లు ప్లేఆఫ్కి అర్హత సాధిస్తాయి.
సిద్దార్థ్ సూపర్-10:
సిద్ధార్థ్ దేశాయ్ ఈ సీజన్లో తొలిసారి స్థాయికి తగ్గ ప్రదర్శన చేయడంతో ఆదివారం జరిగిన పోరులో తెలుగు టైటాన్స్ 40-29తో హరియాణా స్టీలర్స్ను చిత్తు చేసింది. సిద్దార్థ్ దేశాయ్ 18 రైడ్లలో 18 పాయింట్లు సాధించి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. మ్యాచ్ ఆరంభంలో ఇరు జట్లు పాయింట్ల కోసం పోటీ పడ్డాయి. అయితే సూరజ్, సిద్ధార్థ్ చెలరేగడంతో మొదటి 10 నిమిషాల తరువాత తెలుగు టైటాన్స్ 9-6 ఆధిక్యంలోకి వచ్చింది. టైటాన్స్ అదే జోరును కొనసాగిస్తూ.. తొలి అర్ధ భాగంలో 21-13తో ఆధిక్యంలోకి వెళ్ళింది. రెండవ సగం మొదటలో ఇరు జట్ల ఆటగాళ్లు పాయింట్లను సాధించారు. కానీ సిద్దార్థ్ చెలరేగి సూపర్ టెన్ సాధించడంతో హరియాణా ఓడిపోయింది.