
అహ్మదాబాద్: ప్రొ కబడ్డీ లీగ్ సీజన్-7లో హరియాణా స్టీలర్స్ విజయాల పరంపర కొనసాగుతోంది. బుధవారం హోరాహోరీగా జరిగిన మ్యాచ్లో హరియాణా 36-33 తేడాతో యూపీ యోధను ఓడించింది. దీంతో హ్యాట్రిక్ విజయాల్ని నమోదు చేసింది. రైడింగ్లో వికాస్ కండోలా (12), ట్యాక్లింగ్లో సునీల్ (6) రాణించి హరియాణాను విజయంలో కీలక పాత్ర పోషించారు. యూపీ జట్టులో రైడర్లు శ్రీకాంత్ జాదవ్ (9), మోను గోయత్ (5) పోరాడినా ఫలితం లేకుండా పోయింది.
తొలి రైడ్కు వెళ్లిన మోను గోయట్ రెండు పాయింట్లు తెచ్చి యూపీని ఆధిక్యంలో నిలిపాడు. రవికుమార్ ట్యాక్లింగ్ చేయడంతో హర్యానా ఖాతాను తెరిచింది. వికాస్ చెలరేగడంతో 11వ నిమిషంలో ప్రత్యర్థిని ఆలౌట్ చేసిన హరియాణా.. 11-7 ఆధిక్యం సంపాదించింది. అదే జోరులో తొలి అర్ధభాగాన్ని 12-16తో ముగించింది. విరామం తర్వాత యూపీ పుంజుకోవడంతో మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగింది. ఓ దశలో ఇరు జట్ల స్కోరు 17-17తో సమమైంది. ఈ సమయంలో హరియాణాను ఆలౌట్ చేసిన యూపీ 21-19తో ఆధిక్యం సాధించింది. చివరి నిమిషంలో యూపీని ఆలౌట్ చేసిన హరియాణా.. తిరిగి ఆధిక్యం సాధించి మ్యాచ్ను కైవసం చేసుకుంది.
బుధవారమే జరిగిన మరో మ్యాచ్లో బంగాల్ వారియర్స్ 28-26తో గుజరాత్ ఫార్చ్యూన్ జెయింట్స్పై గెలిచింది. బంగాల్ తరపున ప్రపంజన్ (8), మహమ్మద నబిబక్ష్ (5), మణిందర్ సింగ్ (5) రాణించారు. గుజరాత్ జట్టులో సోను (8), సచిన్ (6), సునీల్ కుమార్ (6) ఆకట్టుకున్నారు. తాజా విజయంతో బెంగాల్ వారియర్స్ పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరింది. గురువారం జైపూర్, పుణేరి జట్లు తలపడనున్నాయి.