
చెన్నై: జవహర్లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో శనివారం జరిగిన రెండో మ్యాచ్ టైగా ముగిసింది. దబాంగ్ ఢిల్లీ, బెంగాల్ వారియర్స్ మధ్య హోరాహోరీగా సాగిన మ్యాచ్ చివరకు 30-30తో టైగా ముగిసింది. రైడ్కు వెళ్లిన ప్రపంజన్ విఫలం కావడంతో మ్యాచ్ టై అయింది. బెంగాల్ తరపున రైడర్ ప్రపంజన్, ఢిల్లీ తరపున రైడర్ నవీన్ కుమార్ సూపర్-10లు సాధించారు.
మొదటగా ఢిల్లీ సూపర్ రైడ్ సాధించి పరుగుల ఖాతా తెరిచింది. అదే ఊపులో రైడర్స్ చంద్రన్ రంజిత్ మరియు నవీన్ కుమార్ చెలరేగడంతో 5వ నిమిషంలో బెంగాల్ ఆలౌట్ అయింది. ఇదే సమయంలో బెంగాల్ పుంజుకున్నా.. తొలి అర్ధ భాగాన్ని ఢిల్లీ 18-11తో ముగించింది. రెండవ సగంను కూడా ఢిల్లీ పాయింట్లతో చెలరేగింది. అయితే మ్యాచ్ ఇంకా 12 నిమిషాలు ఉందనగా.. జీవా కుమార్ సూపర్ టాకిల్, సుకేష్ హెగ్డే రెండు రైడ్ పాయింట్లు చేయడంతో బెంగాల్.. ఢిల్లీ స్కోరుకు దగ్గరగా వచ్చింది.
ఇక 4 నిమిషాలు ఆట మిగిలి ఉండగానే ప్రపంజన్ సూపర్-10 సాధించడంతో బెంగాల్ మెరుగుపడింది. 30-29తో ఉన్న సమయంలో.. చివరగా డూ ఆర్ డై రైడ్కు వెళ్లిన ప్రపంజన్ విఫలం కావడంతో బెంగాల్ చివరకు డ్రాతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఢిల్లీ ఆటగాడు ప్రవీన్ కుమార్ 11 పాయింట్లతో 'టాప్' స్కోరర్గా నిలిచాడు. ఆదివారం హరియాణాతో టైటాన్స్ (రా.7.30 నుంచి), తలైవాస్తో పుణెరి (రా.8.30 నుంచి) జట్లు తలపడనున్నాయి.
శనివారం జరిగిన మ్యాచ్లో తమిళ్ తలైవాస్ 21-32తో బెంగళూరు బుల్స్ చేతిలో ఓడింది. తలైవాస్ స్టార్ ఆటగాళ్లు రాహుల్ చౌదరి, మంజీత్ చిల్లర్, అజయ్ ఠాకూర్లు రైడ్ పాయింట్లు తేవడంలో పూర్తిగా విఫలమయ్యారు. బెంగళూరు ఆటగాడు పవన్ షెరావత్ సూపర్ 'టెన్'తో జట్టుకు విజయాన్ని అందించాడు. 8 మ్యాచ్ల్లో 27 పాయింటతో బుల్స్ పట్టికలో రెండో స్థానానికి చేరింది.