
బెంగళూరు: ప్రొ కబడ్డీ సీజన్-7లో డిపెండింగ్ ఛాంపియన్ బెంగళూరు బుల్స్ మరో విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. సొంతగడ్డపై ఆడిన తొలి మ్యాచ్లో ఓడిన బెంగళూరు బుల్స్.. రెండో మ్యాచ్లో మాత్రం సత్తాచాటింది. ఆదివారం జరిగిన మ్యాచ్లో బుల్స్ 33-27తో తమిళ్ తలైవాస్పై విజయం సాధించింది. బుల్స్ స్టార్ రైడర్ పవన్ షెరావత్ (17 పాయింట్లు) జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇక అమిత్ ట్యాక్లింగ్లో హైఫై సాధించాడు.
బెంగళూరు బుల్స్ కెప్టెన్ రోహిత్ కుమార్ రెండు పాయింట్లతో బుల్స్ ఖాతాను తెరిచాడు. కానీ.. తమిళ తలైవాస్ రైడర్ 'షోమాన్' రాహుల్ చౌదరి, మంజీత్ చిల్లార్ పాయింట్లు సాధించడంతో స్కోర్ సమం అయింది. చౌదరి మరో పాయింట్ సాధించినా.. పవన్ వరుస రైడ్లతో చెలరేగడంతో ఇరు జట్ల స్కోర్లు సమం అవుతూ వచ్చాయి. ఓ దశలో స్కోరు 11-10తో బుల్స్ వైపు అనుకూలంగా వచ్చింది. ఈ సమయంలో చౌదరి విఫలమవడం.. పవన్ రెండు టచ్ పాయింట్లను సాధించడంతో బుల్స్ ఆధిక్యాన్ని పెంచుకుంది. అయితే పుంజుకున్న తలైవాస్ తొలి అర్ధ భాగం 13-14తో ముగించింది.
రెండో భాగంలో అజయ్ ఠాకూర్ పాయింట్లు తేవడంతో తలైవాస్ కోలుకుంది. పవన్, అమిత్ సత్తా చాటడంతో తలైవాస్ ఆలౌట్ అయింది. ఇదే ఊపులో బుల్స్ ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. చివరకు తలైవాస్ ఐదు పాయింట్ల తేడాతో ఓడిపోయింది. తలైవాస్ తరఫున రాహుల్ చౌదరి (8 పాయింట్లు), అజయ్ ఠాకూర్ (4 పాయింట్లు) రాణించారు. తలైవాస్ కోర్టులోకి వెళ్లిన ప్రతిసారి పాయింట్ సాధించేందుకు ప్రయత్నించిన పవన్ సఫలమయ్యాడు. తలైవాస్ డిఫెండర్లు పవన్ను పట్టడం మానేసి.. పాయింట్ ఇచ్చుకోకుంటే అంతేచాలు అన్నట్లు ఆడటంతో బుల్స్ అలవోకగా గెలుపొందింది. శనివారం జరిగిన మ్యాచ్లో గుజరాత్ ఫార్చ్యూన్జెయింట్స్ 32-23 స్కోరు తేడాతో బుల్స్ను ఓడించిన విషయం తెలిసిందే.