
పుణె: ప్రొ కబడ్డీ సీజన్-7లో వరుసగా ఆరు మ్యాచ్ల్లో ఓడిన తర్వాత ఎట్టకేకలకు పుణేరి పల్టాన్ గెలుపు బాట పట్టింది. దీంతో హోమ్ లెగ్ను పల్టన్ గ్రాండ్ విక్టరీతో ఆరంభించింది. లీగ్లో భాగంగా శనివారం జరిగిన మ్యాచ్లో పల్టన్ 43-33తో గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్ను ఓడించింది. పుణె స్టార్ రైడర్ నితిన్ తోమర్ 11 పాయింట్లతో జట్టును ముందుండి నడిపించాడు. డిఫెండర్లు సుర్జీత్, బాలాసాహెబ్ జాదవ్ హై-5తో మ్యాచ్కు హైలైట్గా నిలిచారు. గుజరాత్ జట్టులో సచిన్ సూపర్-10తో సత్తా చాటినా ఫలితం లేకుండా పోయింది.
మ్యాచ్ ఆరంభంలోనే నితిన్ తోమర్ విరుచుకుపడడంతో పుణె ఒక్కసారిగా 0-6 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. అదే ఊపులో గుజరాత్ను ఆలౌట్ చేసి 11-3తో నిలిచింది. పుణె ఆటగాళ్లు జోరు కొనసాగించడంతో ఓ దశలో ఆ జట్టు 17 పాయింట్ల ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఈ సమయంలో పుంజుకున్న గుజరాత్ పాయింట్ల అంతరంను తగ్గించుకుంటూ వచ్చింది. అయితే పట్టువదలని పుణె మ్యాచ్ చివరకు అదే ఊపును కొనసాగించి 10 పాయింట్ల తేడాతో విజయాన్ని అందుకుంది.
శనివారం జరిగిన మరో మ్యాచ్లో హర్యానా స్టీలర్స్ 43-35 తేడాతో తమిళ్ తలైవాస్పై విజయం సాధించింది. హర్యానా స్టార్ రైడర్ వికాస్ ఖండోలా 13 పాయింట్లతో టాప్ స్కోరర్గా నిలిచాడు. రాహుల్ చౌదరి సూపర్-10 సాధించినా డిఫెన్స్లో వైఫల్యం తలైవాస్ ఓటమికి కారణమైంది. ఈ విజయంతో హర్యానా పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి ఎగబాకింది.