
హైదరాబాద్: ప్రో కబడ్డీ ఏడో సీజన్లో భాగంగా ప్రస్తుతం మ్యాచ్లు చెన్నై అంచెలో జరుగుతున్నాయి. జూలై 20న ఆరంభమైన ఈ సీజన్లో మొత్తం 12 జట్లు పోటీపడుతున్నాయి. ఇప్పటికే టోర్నీలో 50పైగా మ్యాచ్లు ముగిశాయి. ఏడు విజయాలతో జైపూర్ పింక్ పాంథర్స్ జట్టు పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. తెలుగు టైటాన్స్ మాత్రం ఇప్పటికీ పుంజుకోవట్లేదు. ఇప్పటివరకు తొమ్మిది మ్యాచ్లు ఆడి కేవలం రెండింట మాత్రమే విజయం సాధించి 11వ స్థానంలో ఉంది.
ఈ సీజన్లో రైడర్లు పెద్దగా ఆకట్టుకోవట్లేదు. ఏదో ఒక్కో మ్యాచులో తప్పితే.. 15 రైడ్ పాయింట్లు సాధించిన సందర్భాలు తక్కువే. ఇక సూపర్-10లు కూడా అప్పుడప్పుడు కనబడుతున్నాయి. అయితే బెంగళూరు బుల్స్ అగ్రశ్రేణి రైడర్ పవన్ కుమార్ సెరావత్ బాగా రాణిస్తున్నాడు. మ్యాచ్ మ్యాచ్కి దూకుడు పెంచుతూ.. ఈ సీజన్లో 100 రైడ్ పాయింట్లు సాధించాడు. ఈ సీజన్లో 100 రైడ్ పాయింట్లు సాధించిన తొలి ఆటగాడు కూడా పవన్ కావడం విశేషం.
పవన్ (5) సత్తా చాటకపోవడంతో బుధవారం జరిగిన మ్యాచ్లో బెంగళూరు బుల్స్కు షాక్ తగిలింది. ట్యాక్లింగ్లో సుర్జీత్ సింగ్ చెలరేగడంతో పుణెరి పల్టాన్ 31-23 తేడాతో బెంగళూరుపై విజయం సాధించింది. సుర్జీత్ డిఫెన్స్ వ్యూహాల ముందు పవన్ శెరావత్ ఆటలు సాగలేదు. ప్రస్తుతం బెంగళూరు బుల్స్ 27 పాయింట్లతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. హర్యానా, యూపీ, ముంబా, గుజరాత్, తలైవా జట్లు బుల్స్ స్కోరుకు దగ్గరగా ఉండంతో.. తుది ఆరులో చోటు దక్కాలంటే శ్రమించాల్సిందే.