
ముంబై: ప్రొ కబడ్డీ లీగ్ ఏడో సీజన్లో వరుస విజయాలతో దూసుకెళ్తున్న దబంగ్ ఢిల్లీకి కళ్లెం పడింది. సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ ఇండోర్ స్టేడియంలో గురువారం జరిగిన మ్యాచ్లో గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్ జట్టు 31-26తో ఢిల్లీని ఓడించింది. దీంతో ఇప్పటి వరకు ఆడిన మూడు మ్యాచ్ల్లోనూ గెలిచిన గుజరాత్ హ్యాట్రిక్ విజయాలను సాధించింది. మరోవైపు వరుసగా మూడు మ్యాచ్ల్లో నెగ్గిన డిల్లీకి ఇదే తొలి పరాజయం. రైడింగ్లో రోహిత్ గులియా (7)లకు తోడు మోర్ జీబీ (9) ఆల్రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకోవడంతో గుజరాత్ సునాయాస విజయాన్ని అందుకుంది.
మ్యాచ్ ఆరంభంలో రైడర్లు పాయింట్లు తేవడంతో తొలి ఐదు నిమిషాలు ముగిసే సరికి గుజరాత్ 6-1తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఈ సమయంలో రైడర్ నవీన్ (10) చెలరేగడంతో పుంజుకొన్న ఢిల్లీ 16వ నిమిషంలో స్కోరును 9-9తో సమం చేసింది. అదే జోరు కొనసాగిస్తూ 18వ నిమిషంలో గుజరాత్ను ఆలౌట్ చేసిన ఢిల్లీ.. తొలి అర్ధ భాగాన్ని 14-11తో ముగించింది.
విరామం తర్వాత రెండు జట్లు పాయింట్ల కోసం హోరాహోరీగా తలపడ్డాయి. ఢిల్లీ ఆటగాడు చంద్రన్ రంజిత్ సూపర్ ట్యాకిల్ చేయడంతో మరో పదినిమిషాల ఆట మిగిలి ఉందనగా స్కోరు 20-20తో సమమైంది. అనంతరం ఢిల్లీని ఆలౌట్ చేసిన గుజరాత్.. 25-20తో మళ్లీ ఆధిక్యంలోకి వచ్చింది. ఇక అక్కడి నుంచి గుజరాత్ దూకుడు ప్రదర్శించింది. నిలకడగా పాయింట్లు చేస్తూ.. చివరి రెండు నిమిషాల ఆట మిగిలి ఉందనగా 31-25తో నిలిచిన గుజరాత్ మ్యాచ్ను సొంతం చేసుకుంది. ఢిల్లీ రైడర్ నవీన్ కుమార్ సూపర్ 'టెన్' సాధించినా.. ఆ జట్టుకు విజయాన్ని అందించలేకపోయాడు. శుక్రవారం జరిగే మ్యాచ్లో యూపీ యోధతో తెలుగు టైటాన్స్.. యు ముంబాతో గుజరాత్ ఫార్చున్ జెయింట్స్ తలపడతాయి.