
కోల్కతా: ప్రొ కబడ్డీ లీగ్ ఏడో సీజన్లో అన్ని జట్లు పుంజుకుని విజయాల బాట పడుతుంటే.. తెలుగు టైటాన్స్ పరిస్థితి మాత్రం మారడం లేదు. లీగ్ మొదటి నుంచి పరాజయాలను ఎదుర్కొంటున్న టైటాన్స్ అదే బాటలో నడుస్తోంది. ఇప్పటివరకు కేవలం నాలుగు విజయాలు మాత్రమే టైటాన్స్ ఖాతాలో ఉన్నాయంటే అర్ధం చేసుకోవచ్చు ఆ జట్టు ఎంతలా విఫలమవుతోందో. తమిళ్ తలైవాస్పై గెలుపొంది గాడిలో పడిందనుకుంటే మళ్లీ ఓడిపోయి నిరాశపరిచింది.
మంగళవారం కోల్కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇండోర్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో టైటాన్స్ 27-41తో యు ముంబా చేతిలో పరాజయం పాలైంది. ముంబా తరఫున అర్జున్ దేశ్వాల్ (10 పాయింట్లు), రోహిత్ బలియాన్ (7 పాయింట్లు) రాణించారు. టైటాన్స్ తరఫున స్టార్ రైడర్ సిద్ధార్థ్ దేశాయ్ (4 పాయింట్లు) పూర్తిగా విఫలమయ్యాడు. రాకేష్ గౌడ, విశాల్ భరద్వాజ్ రాణించారు.
ముంబా మొదటి నిమిషంలోనే 3-0తో ఖాతా తెరిచింది. అయితే మూడో నిమిషంలో టైటాన్స్ స్కోరును చేసింది. ఐతే సిద్ధార్థ్, రోహిత్ రాణించడంతో ఓ దశలో టైటాన్స్ 13-9తో నిలిచింది. పుంజుకున్న ముంబా తొలి అర్ధభాగాన్ని 15-15తో ముగించింది. విరామం అనంతరం టైటాన్స్ జట్టును అలౌట్స్ చేస్తూ భారీ ఆధిక్యాన్ని సంపాదించిన ముంబా.. అదే ఊపులో మ్యాచును సొంతం చేసుకుంది. మూడు సార్లు ఆలౌట్ కావడంతో టైటాన్స్కు ఓటమి తప్పలేదు. ప్రస్తుతం లీగ్లో 14 మ్యాచ్లు ఆడిన టైటాన్స్ 4 విజయాలు 8 పరాజయాలు 2 టైలతో 30 పాయింట్లు ఖాతాలో వేసుకొని పట్టికలో 9వ స్థానంలో నిలిచింది.
ప్రొ కబడ్డీ లీగ్ ఏడో సీజన్ ఫైనల్కు అహ్మదాబాద్ వేదిక కానుంది. వచ్చే నెల 19న అహ్మదాబాద్లో ప్లే ఆఫ్ట్స్ నిర్వహించనున్నట్లు పీకేఎల్ జయమాన్యం మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. అక్టోబర్ 14న ఎలిమినేటర్స్, 16న సెమీఫైనల్స్, 19న ఫైనల్స్ నిర్వహించనున్నట్లు పేర్కొంది.