
కోల్కతా: ప్రస్తుతం ప్రొ కబడ్డీ లీగ్ ఏడో సీజన్ మ్యాచ్లు కోల్కతా అంచెలో జరుగుతున్నాయి. జూలై 20న ఆరంభమైన ఈ సీజన్లో మొత్తం 12 జట్లు పోటీపడుతున్నాయి. ఇప్పటికే ఒక్కో జట్టు లీగ్ దశలో సగం మ్యాచులను పూర్తి చేసుకున్నాయి. లీగ్ ఆరంభంలో జైపూర్ పింక్ పాంథర్స్ హవా కొనసాగగా.. ప్రస్తుతం దబాంగ్ ఢిల్లీ వరుస విజయాలతో అగ్రస్థానంలో ఉంది. ఇక హర్యానా స్టీలర్స్, బెంగాల్ వారియర్స్, బెంగళూరు బుల్స్ జట్లు కూడా దూసుకుపోతున్నాయి.
దబాంగ్ ఢిల్లీ వరుస విజయాలు సాధించడానికి ప్రధాన కారణం ఆ జట్టు స్టార్ రైడర్ నవీన్ కుమార్. ప్రతి మ్యాచ్లో పాయింట్లు సాధించి ఢిల్లీకి ఒంటిచేత్తో విజయాన్ని అందిస్తున్నాడు. మిరాజ్ షేక్, చంద్రన్ రంజిత్, అమన్ కడియన్, నీరజ్ నర్వాల్ లాంటి రైడర్లు ఉన్నా.. ప్రతి మ్యాచ్లో నవీన్ సూపర్-10 సాధిస్తున్నాడు. ఈ క్రమంలోనే పీకేల్-7లో వరుసగా 12వ సూపర్-10 సాధించాడు. ఏడో సీజన్లో ఇంతలా సక్సెస్ అయిన రైడర్ ఎవరూ లేరు. ఈ సీజన్లో 100 రైడ్ పాయింట్లు సాధించిన రెండో ఆటగాడిగా కూడా నవీన్ రికార్డుల్లోకి ఎక్కాడు. ప్రస్తుతం బెంగళూరు బుల్స్ అగ్రశ్రేణి రైడర్ పవన్ కుమార్ సెరావత్ (187) అగ్రస్థానంలో ఉండగా.. నవీన్ (174) రెండో స్థానంలో ఉన్నాడు.
గత మ్యాచ్లో ఓడిన టేబుల్ టాపర్ దబంగ్ ఢిల్లీ తిరిగి పుంజుకుంది. ప్రొ కబడ్డీ లీగ్ ఏడో సీజన్లో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచ్లో ఢిల్లీ 50-34తో తమిళ్ తలైవాస్ను చిత్తు చిత్తుగా ఓడించింది. యువ రైడర్ నవీన్ కుమార్ (17 పాయిం ట్లు), మిరాజ్ షేక్ (12 పాయింట్లు) ఆకట్టుకోవడంతో ఢిల్లీ అలవోక విజయాన్ని అందుకుంది. తలైవాస్ తరఫున రాహుల్ చౌదరి (14 పాయింట్లు) రాణించినా.. అతడికి సహకారం లభించకపోవడంతో తలైవాస్కు ఓటమి తప్పలేదు. దబంగ్ ఢిల్లీ ఇప్పటివరకు 14 మ్యాచ్లు ఆడగా.. 11 విజయాలు, రెండు ఓటములు, ఒక టైతో 59 పాయింట్లు సాధించి అగ్రస్థానంలో కొనసాగుతోంది.