
కోల్కతా: గత మ్యాచ్లో ఓడిన టేబుల్ టాపర్ దబంగ్ ఢిల్లీ తిరిగి పుంజుకుంది. ప్రొ కబడ్డీ లీగ్ ఏడో సీజన్లో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచ్లో ఢిల్లీ 50-34తో తమిళ్ తలైవాస్ను చిత్తు చిత్తుగా ఓడించింది. యువ రైడర్ నవీన్ కుమార్ (17 పాయిం ట్లు), మిరాజ్ షేక్ (12 పాయింట్లు) ఆకట్టుకోవడంతో ఢిల్లీ అలవోక విజయాన్ని అందుకుంది. తలైవాస్ తరఫున రాహుల్ చౌదరి (14 పాయింట్లు) రాణించినా.. అతడికి సహకారం లభించకపోవడంతో తలైవాస్కు ఓటమి తప్పలేదు.
మ్యాచ్ ఆరంభం నుంచే ఢిల్లీ మ్యాచ్పై పట్టు బిగించింది. నవీన్ కుమార్ వరుసగా రైడ్ పాయింట్లు తేవడంతో మ్యాచ్ 10వ నిమిషానికే తలైవాస్ ఆలౌటైంది. ఇదే ఊపును కొనసాగించిన ఢిల్లీ తొలి అర్ధభాగాన్ని 24-12తో ముగించింది. భారీ ఆధిక్యంలో ఉన్న ఢిల్లీ విరామం అనంతరం కూడా సత్తా చాటింది. రెండో అర్ధ భాగంలో నవీన్కి మరో రైడర్ మిరాజ్ షేక్ కూడా జతవడంతో తలైవాస్కు కష్టాలు రెట్టింపు అయ్యాయి. ఈ జోడీ విజృంభణతో ఢిల్లీ వరుసగా పాయింట్లు రాబట్టింది. ఇదే జోరు కొనసాగిస్తూ మ్యాచ్ను కైవసం చేసుకొంది. దీంతో ప్రస్తుత సీజన్లో 50 పాయింట్ల మార్క్ను అందుకున్న తొలి జట్టుగా ఢిల్లీ నిలిచింది.
దబంగ్ ఢిల్లీ ఇప్పటివరకు 14 మ్యాచ్లు ఆడగా.. 11 విజయాలు, రెండు ఓటములు, ఒక టైతో 59 పాయింట్లు సాధించి అగ్రస్థానంలో కొనసాగుతోంది. గత మ్యాచులో దబంగ్ ఢిల్లీకి హర్యానా స్టీలర్స్ షాక్ ఇచ్చింది. శనివారం జరిగిన మ్యాచ్లో హరియాణా స్టీలర్స్ 47-25తో దబాంగ్ ఢిల్లీని చిత్తు చేసింది. హరియాణా రైడర్లు వికాస్ ఖండోలా, ప్రశాంత్ కుమార్ చెరో సూపర్-10తో రాణించగా.. డిఫెన్స్లో వికాస్ కాలే 5 పాయింట్లతో సత్తా చాటారు. ఢిల్లీ తరఫున నవీన్ కుమార్ 11 పాయింట్లతో టాప్ స్కోరర్గా నిలిచాడు.