
హైదరాబాద్: ప్రో కబడ్డీ లీగ్ 7వ సీజన్ తుది దశకు చేరుకుంది. అక్టోబర్ 14 నుంచి ప్లే ఆఫ్ మ్యాచ్లు జరగనున్నాయి. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన టాప్-6 జట్లు ప్లే ఆఫ్కు అర్హత సాధిస్తాయి. ఈ సీజన్లో ఢిల్లీ దబాంగ్ అద్భుత విజయాలను నమోదు చేసి పట్టికల్ అగ్రస్థానంలో నిలిచింది.
లీగ్ దశలో మొత్తం 20 మ్యాచ్లు ఆడిన ఢిల్లీ దబాంగ్ 15 విజయాలు, 3 పరాజయాలు, 2 టై ఫలితాలతో మొత్తం 82 పాయింట్లు సాధించి పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. 78 పాయింట్లతో బెంగాల్ వారియర్స్, 65 పాయింట్లతో హర్యానా స్టీలర్స్, 64 పాయింట్లతో యు ముంబా, 63 పాయింట్లతో బెంగళూరు బుల్స్ ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి.
58 పాయింట్లతో యూపీ యోధా ఆరు స్థానాలలో నిలవడం ద్వారా ప్లే ఆఫ్కు అర్హత సాధించాయి. మొత్తం 12 జట్లు రౌండ్ రాబిన్ లీగ్లో తలపడిన ఈ మెగా టోర్నీలో టాప్-6లో నిలిచిన జట్ల మధ్య అక్టోబర్ 14 నుంచి అహ్మదాబాద్ వేదికగా ప్లే ఆఫ్ మ్యాచ్లు జరగనున్నాయి. అక్టోబర్ 14 రాత్రి 7.30 గంటలకు జరిగే ఎలిమినేటర్ -1లో లీగ్లో 3వ స్థానంలో నిలిచిన జట్టుతో 6వ స్థానంలో నిలిచిన జట్టుతో తలపడనుంది.
అదే రోజు రాత్రి 8.30 గంటలకు జరిగే ఎలిమినేటర్-2 మ్యాచ్లో లీగ్ 4వ స్థానంలో నిలిచిన జట్టుతో 5వ స్థానంలో నిలిచిన జట్టు తలపడనుంది. ఇక, అక్టోబర్ 16న జరగనున్న తొలి సెమీ ఫైనల్లో ఈ సీజన్లో అగ్రస్థానంలో నిలిచిన జట్టుతో ఎలిమినేటర్-1 విజేత తలపడనుంది. అదే రోజు రాత్రి 8.30 గటలకు జరిగే రెండో సెమీస్లో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచిన జట్టుతో ఎలిమినేటర్-2 విజేత తలపడనుంది.
అక్టోబర్ 19న ఫైనల్స్
సెమీఫైనల్స్లో విజయం సాధించిన రెండు జట్ల మధ్య అక్టోబర్ 19న ఫైనల్స్ జరగనుంది. ప్లే ఆఫ్ మ్యాచ్లు అన్నింటికీ అహ్మదాబాద్లోని EKA Arena by TransStadia స్టేడియం ఆతిథ్యమివ్వనుంది.