
అహ్మదాబాద్: సొంతగడ్డపై జరిగిన తొలి మ్యాచ్లో గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్ ఓడిపోయింది. శనివారం అహ్మదాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్లో గుజరాత్ 28-34తో తమిళ్ తలైవాస్ చేతిలో ఓటమి పాలైంది. దీంతో ప్రొ కబడ్డీ ఏడో సీజన్లో తమిళ్ తలైవాస్ ఖాతాలో మరో విజయం చేరింది. రైడింగ్లో కెప్టెన్ అజయ్ ఠాకూర్ (9) మెరుపులు.. ట్యాక్లింగ్లో మోహిత్ చిల్లర్ (5), మంజీత్ చిల్లర్ (4) రాణించడంతో తలైవాస్ సునాయాస విజయాన్ని అందుకుంది. స్టార్ రైడర్ రాహుల్ చౌదరి (4 పాయింట్లు) నిరాశపరిచాడు.
మ్యాచ్ ఆరంభంలో ఇరు జట్లు పాయింట్ల కోసం పోటీపడ్డాయి. 12 నిమిషాలు ముగిసే సరికి 6-6తో స్కోరు సమమైంది. అయితే కీలక దశలో రెండుసార్లు డూ ఆర్ డై రైడ్లలో పాయింట్లు సాధించిన అజయ్.. తలైవాస్ను ఆధిక్యంలోకి తీసుకెళ్లాడు. ఇదే జోరులో ప్రత్యర్థిని ఆలౌట్ చేయడంతో తొలి అర్ధభాగాన్ని తలైవాస్ 15-10తో ముగించింది. విరామం తర్వాత కూడా తలైవాస్ జోరు కొనసాగింది. ఓ దశలో 21-14తో తలైవాస్ జట్టు తిరుగులేని ఆధిక్యం సాధించింది. ఈ సమయంలో రోహిత్ గులియా (9), సునీల్ (6) విజృంభించడంతో మరో నాలుగు నిమిషాల్లో ఆట ముగుస్తుందనగా.. ప్రత్యర్థిని ఆలౌట్ చేసిన గుజరాత్ 26-25తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఆ వెంటనే అజయ్ సూపర్ రైడ్ చేసి గుజరాత్ను ఆలౌట్ చేసాడు. చివరి వరకు ఆధిపత్యం చెలాయించిన తలైవాస్.. సులభంగా విజయాన్ని అందుకుంది.
శనివారం హోరాహోరీగా సాగిన మరో మ్యాచ్లో దబంగ్ డిల్లీ 32-30తో పుణెరి పల్టాన్పై విజయం సాధించింది. దిల్లీ జట్టులో రైడర్లు నవీన్ కుమార్ (11), చంద్రన్ రంజిత్ (8) రాణించారు. పుణెరి తరపున రైడింగ్లో నితిన్ తోమర్ (8), మంజీత్ (6).. డిఫెన్స్లో గిరీశ్ (4) పోరాడినా ఫలితం లేకపోయింది. ఆదివారం బెంగళూరు బుల్స్తో హరియాణా స్టీలర్స్, గుజరాత్ ఫార్చ్యూన్ జెయింట్స్తో తెలుగు టైటాన్స్ తలపడతాయి.