హైదరాబాద్: ప్రొ కబడ్డీలో లీగ్లో దబాంగ్ ఢిల్లీ రెండో విజయాన్ని నమోదు చేసింది. క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ సహ యజమానిగా ఉన్న తమిళ్ తలైవాస్తో గురువారం జరిగిన మ్యాచ్లో దబాంగ్ ఢిల్లీ 30-29తో విజయం సాధించింది. ఇరాన్ ఆటగాళ్లు మిరాజ్ షేక్, అబోల్ఫజల్లు 20 పాయింట్లతో దబాంగ్ విజయంలో కీలక పాత్ర పోషించారు.
మ్యాచ్ ముగియడానికి మరో 40 సెకన్ల వ్యవధి ఉందనగా ఢిల్లీ 27-28తో వెనుకబడి ఉంది. ఈ దశలో రైడింగ్కు వెళ్లిన ఢిల్లీ ప్లేయర్ మేరాజ్ షేక్ మూడు పాయింట్లు సాధించడంతో ఢిల్లీ 30-28తో ఆధిక్యంలోకి వచ్చింది. ఆ తర్వాత తమిళ్ తలైవాస్ రైడర్ అజయ్ ఠాకూర్ ఒకపాయింట్ సాధించినా ఫలితం లేకపోయింది. చివరకు ఢిల్లీ జట్టు ఒక్క పాయింట్తో గట్టెక్కింది.
అజయ్ ఠాకూర్ 14 పాయింట్లు సాధించినా తమిళ్ తలైవాస్ను గెలిపించలేకపోయాడు. ఢిల్లీ తరఫున మేరాజ్ షేక్ అత్యధికంగా తొమ్మిది పాయింట్లు సాధించాడు. తొలి రెండు నిమిషాల్లో రైడ్లతో రెండు జట్లు పాయింట్ల ఖాతా తెరిచాయి. రైడర్లు పాయింట్లు రాబట్టడంతో ఐదు నిమిషాలయ్యే సరికి ఢిల్లీ 5-2తో ఆధిక్యంలో నిలిచింది.

ఆ తర్వాత తమిళ్ తలైవాస్ 6-5తో ఆధిక్యం సాధించింది. ఆరంభం నుంచే రెండు జట్లూ చెరో పాయింట్ నెగ్గుతూ వెళ్లడంతో ప్రథమార్ధం 12-12తో ముగిసింది. రెండో అర్ధభాగంలో అజయ్ ఠాకూర్ వరుస రైడ్ పాయింట్లతో అదరగొట్టడంతో.. 33వ నిమిషంలో ప్రత్యర్థిని ఆలౌట్ చేసిన తలైవాస్ 25-22తో ముందంజ వేసింది.
ఆ తర్వాత 35వ నిమిషంలో అతడే రెండు పాయింట్లు తేవడంతో తలైవాస్ 27-23తో గెలుపు దిశగా సాగింది. అయితే 37వ నిమిషంలో మిరాజ్ షేక్ డబుల్ రైడ్ పాయింట్ రాబట్టగా.. ప్రపంజన్ను టాకిల్ చేసిన ఢిల్లీ చివరి నిమిషంలో 27-28తో నిలిచి మ్యాచ్పై ఉత్కంఠ రేపింది.
మరో 40 సెకన్లలో ఆట ముగుస్తుందనగా కూతకు వెళ్లిన మిరాజ్ మూడు పాయింట్లు తెచ్చి దబాంగ్ను 30-28తో ఆధిక్యంలో నిలిచాడు. ఆ తర్వాత అజయ్ ఠాకూర్ ఓ రైడ్ పాయింట్ తెచ్చినా తలైవాస్కు ఓటమి తప్పించలేకపోయాడు. మరోవైపు గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్, బెంగాల్ వారియర్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ 26-26తో టైగా ముగిసింది.
శుక్రవారం జరిగే మ్యాచ్ల్లో యూపీ యోధతో యు ముంబా; బెంగళూరు బుల్స్తో జైపూర్ పింక్ పాంథర్స్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్లను స్టార్ స్పోర్ట్స్-2 చానెల్ ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది.