హైదరాబాద్: ప్రొ కబడ్డీ లీగ్లో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచ్లో జైపూర్ పింక్ పాంథర్స్ విజయం సాధించింది. దబాంగ్ ఢిల్లీతో హోరాహోరీగా సాగిన మ్యాచ్లో జైపూర్ 36-25 తేడాతో విజయం సాధించింది. జైపూర్ జట్టులో పవన్, నితిన్ రావల్, సిద్ధార్థ్లు తలో ఆరు పాయింట్లు స్కోర్ చేశారు.
ఇక, ఢిల్లీ తరుపున అబోల్ఫాజిల్ (6 పాయింట్లు) రాణించాడు. మ్యాచ్ ఆరంభం నుంచే ఢిల్లీ తన స్ధాయికి తగ్గ ప్రదర్శన కనబర్చడంలో విఫలమైంది. తాజా విజయంతో జోన్-ఏలో జైపూర్ 36 పాయింట్లతో ఐదో స్థానంలో కొనసాగుతుండగా, ఢిల్లీ (28 పాయింట్లు) అట్టడుగున ఆరో స్థానంలో ఉన్నాయి.

పాట్నా, బెంగాల్ మ్యాచ్ టై
సొంతగడ్డపై వరుస విజయాలతో దూసుకెళ్తున్న డిఫెండింగ్ చాంపియన్ పట్నా పైరేట్స్కు బెంగాల్ ఝలక్ ఇచ్చింది. ప్రో కబడ్డీ లీగ్లో ఆదివారం పాట్నా పైరేట్స్, బెంగాల్ వారియర్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ టైగా ముగిసింది. ఓటమి అంచున ఉన్న బెంగాల్ వారియర్స్, చివరి రైడ్లో పాయింట్ కలిసి రావడంతో మ్యాచ్ 37-37తో టైగా ముగిసింది.

పాట్నా ఆటగాళ్లలో పర్దీప్ నర్వాల్ 13 పాయింట్లతో టాప్ స్కోరర్గా నిలిస్తే, మోనూ గోయత్ 11 పాయింట్లు చేశాడు. బెంగాల్ ఆటగాడు మనీందర్ సింగ్ 15 పాయింట్లు సాధించగా, సబ్స్టిట్యూట్ దీపక్ నర్వాల్ 10 పాయింట్లు చేయడం విశేషం. 34-37తో ఉన్న సమయంలో ఆఖరి రైడ్ వెళ్లిన బెంగాల్ రైడర్ రాన్ సింగ్ 3 పాయింట్లు తేవడంతో మ్యాచ్ టైగా ముగిసింది.