అహ్మదాబాద్: కబడ్డీ వరల్డ్ కప్ టోర్నీలో భారత్ అద్భుతమైన ఆటతీరుని ప్రదర్శిస్తోంది. కబడ్డీలో భారత జట్టు ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ సెమీస్లోకి అడుగుపెట్టింది. సొంతగడ్డపై అభిమానుల మద్దతుతో మంగళవారం రాత్రి జరిగిన పోరులో భారత్ 69-18తో ఇంగ్లాండ్పై భారీ విజయం సాధించింది.
తొలి మ్యాచ్లో కొరియా చేతిలో ఓటమి పాలైన భారత జట్టు ఆ తర్వాత వరుసగా నాలుగు మ్యాచ్ల్లో విజయాలతో మొత్తం 21 పాయింట్లు దక్కించుకుంది. దీంతో గ్రూప్-ఏలో కొరియా(25) తర్వాత రెండో స్థానంలో నిలిచి సెమీస్కు అర్హత సాధించింది. మంగళవారం మ్యాచ్లో ఆరంభం నుంచి భారత జట్టు ఆధిపత్యం చెలాయించింది.
భారత ఆటగాళ్ల దూకుడుకు ఇంగ్లాండ్ జట్టు ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోయింది. వరుసగా పాయింట్లు కొల్లగొడుతూ ఇంగ్లాండ్ జట్టుపై ఒత్తిడి పెంచింది. అనూప్ తొలి రైడ్కు వెళ్లి పాయింట్ సాధించగా, ఆ తర్వాత రైడింగ్లో పర్దీప్ నార్వల్, అజయ్ ఠాకూర్లు దూకుడుగా ఆడి పాయింట్లు సాధించారు.

పర్దీప్ ఈ మ్యాచ్లో అత్యధికంగా 13 రైడ్ పాయింట్లు సాధించగా, అజయ్ 11 పాయింట్లు సాధించాడు. వీరిద్దరి దూకుడుతో మ్యాచ్ మొదలైన ఆరు నిమిషాలకే ఇంగ్లండ్ తొలిసారి ఆలౌటైంది. ముఖ్యంగా కబడ్డీలో ఇంగ్లాండ్ అనుభవలేమిని తమకు అనుకూలంగా మలచుకోవడంలో వీరిద్దరూ సఫలీకృతులయ్యారు.
ఈ క్రమంలో ప్రథమార్ధం ముగిసేసరికి భారత్ 45-6తో స్పష్టమైన ఆధిక్యంలో నిలిచింది. ద్వితీయార్ధంలో కీలక ఆటగాళ్లను విశ్రాంతినిస్తూ రిజర్వ్ బెంచ్ ఆటగాళ్లు బరిలోకి దిగారు. ద్వితీయార్ధంలో సబ్స్టిట్యూట్గా బరిలో దిగిన రాహుల్ చౌదరి రాగానే రైడ్కు వెళ్లి పాయింట్ సాధించాడు.

ఆ తర్వాత 5 పాయింట్లు గెలిచి మ్యాచ్ మొత్తాన్ని తనవైపుకి తిప్పుకున్నాడు. కాగా, ప్రథమార్ధంలో పర్దీప్, అనురాగ్ రైడింగ్లో రెచ్చిపోతే ద్వితీయార్ధంలో నితిన్ తోమర్(7), దీపక్ చౌదరి(5) పాయింట్లు సాధించడంలో పోటీ పడ్డారు. మొత్తంగా ఈ మ్యాచ్లో ఏ దశలోనూ ఆతిథ్య భారత్కు ఇంగ్లాండ్ జట్టు పోటీ ఇవ్వలేకపోయింది.
21 October:
SEMI FINAL 1 (8.00 PM IST)
SEMI FINAL 2 (9.00 PM IST)
22 October: FINAL (9.00 PM IST)