న్యూఢిల్లీ: హర్యానాలోని రోహతక్లో పట్టపగలు దారుణం చోటు చేసుకుంది. నడిరోడ్డుపై జాతీయ కబడ్డీ ప్లేయర్ను ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా చంపేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే.. జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న సుఖ్వీందర్ నర్వహల్ అనే ఆటగాడు ప్రాక్టీస్ ముగించుకుని ఇంటికి వస్తున్న సమయంలో అతడిని ఇద్దరు వ్యక్తులు కాల్చి చంపారు.

ఈ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్లో హల్చల్ చేస్తోంది. వీడియోలో సుఖ్వీందర్ నర్వహల్ ప్రాక్టీస్ ముగించుకుని ఫోన్లో మాట్లాడుకుంటూ ఇంటికి వెళుతున్నాడు. ఈ క్రమంలో స్కూటర్పై వచ్చిన ఇద్దరు నిందితులు విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. బుల్లెట్ తగిలి అతడు కిందపడిపోగా వారు స్కూటర్ దిగి మళ్లీ అతడి తలపై, ఛాతీపై పదే పదే కాల్పులు జరిపి పారిపోయారు.
ఈ కాల్పుల ఘటన మొత్తం కొద్ది దూరంలో ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డు అయింది. సీసీ టీవీ పుటేజ్ల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గతంలో కూడా ఇలాంటి సంఘటనే ఒకటి జరిగింది. కబడ్డీ ప్లేయర్ కుమార్ ఇదే రోహతక్ పట్టణంలో హత్యకు గురయ్యాడు.