ర్యాంకులను నిలిపివేయాలి.. భారత షట్లర్ల డిమాండ్!!

న్యూఢిల్లీ: మహమ్మారి కరోనా వైరస్ కారణంగా టోక్యో ఒలింపిక్స్ వాయిదాతో పాటు టోర్నీలు రద్దవుతున్నా.. బ్యాడ్మింటన్ ప్రపంచ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) ర్యాంకులను నిలిపివేయకపోవడంపై భారత షట్లర్లు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. విశ్వక్రీడల అర్హత ప్రక్రియపై స్పష్టతనివ్వాలని డిమాండ్ చేశారు. బీడబ్ల్యూఎఫ్ కనీసం ర్యాంకులనైనా నిలుపుదల చేయాల్సిందని షట్లర్లు సైనా నెహ్వాల్, సాయి ప్రణీత్, పారుపల్లి కశ్యప్, హెచ్ఎస్ ప్రణయ్ ఇప్పటికే కోరారు.
'కరోనా వైరస్ కారణంగా బీడబ్ల్యూఎఫ్ టోర్నమెంట్లు వాయిదా వేసినా మా పాయింట్లు తగ్గిపోతున్నాయి. స్విస్ ఓపెన్ను వాయిదా వేశారు. అయినా నా పాయింట్లు తగ్గాయి. ఇలా వాయిదా వేసిన అన్ని టోర్నీలకూ పాయింట్లు తగ్గిస్తూ పోతే ఏం జరుగుతుందో తెలియదు. ఒకవేళ ఒలింపిక్స్ జూలైలో జరిగి ఉంటే నేను తప్పక అర్హత సాధించేవాడిని' అని సాయి ప్రణీత్ అన్నాడు.
టోక్యో ఒలింపిక్స్ వాయిదాపడ్డ నేపథ్యంలో బ్యాడ్మింటన్ ర్యాంకింగ్స్ను నిలిపివేసే అవకాశాల్ని పరిశీలిస్తున్నామని ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య చెప్పింది. 'ఒలింపిక్స్ వాయిదాతో ఒలింపిక్స్, పారాలింపిక్స్ క్వాలిఫికేషన్ వ్యవస్థపై ఏమైనా ప్రభావం పడిందేమో చూస్తాం. తిరిగి అంతర్జాతీయ టోర్నీలు ఆరంభమయ్యే వరకు ర్యాంకులను స్తంభింపచేసే అవకాశాన్ని పరిశీలిస్తున్నాం' అని బీడబ్ల్యూఎఫ్ ఓ ప్రకటలో చెప్పింది.
కరోనా నేపథ్యంలో దేశం మొత్తం లాక్డౌన్ స్థితిలోకి వెళ్లిన నేపథ్యంలో భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. ప్రతిష్టాత్మక జాతీయ సీనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ను వాయిదా వేస్తున్నట్లు స్పష్టం చేసింది. షెడ్యూల్ ప్రకారం లక్నో వేదికగా ఏప్రిల్ 27 నుంచి మే 3 వరకు ఈ టోర్నీ జరగాల్సి ఉండగా, ప్రస్తుత పరిస్థితుల్లో దురదృష్టవశాత్తు టోర్నీని వాయిదా వేస్తున్నట్లు 'బాయ్' కార్యదర్శి అజయ్ సింఘానియా వెల్లడించారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications