గత 30 రోజుల్లో భారతీయ క్రీడా చరిత్రలో మహిళా క్రీడామణులు చెరగని ముద్ర వేశారు. కేవలం ఒక్క నెల వ్యవధి కాలంలోనే ఏకంగా 3 ప్రతిష్టాత్మక ప్రపంచ కప్ టైటిళ్లను గెలుచుకుని దేశం పేరును ప్రపంచ వేదికపై సగర్వంగా నిలబెట్టారు. ఈ అద్భుతమైన విజయాల పరంపరలో చివరగా మహిళల కబడ్డీ ప్రపంచ కప్ 2025 టైటిల్ను కైవసం చేసుకుని భారత క్రీడాకారిణులు హ్యాట్రిక్ పూర్తి చేశారు.
వరుసగా రెండో టైటిల్
బంగ్లాదేశ్లోని ఢాకాలో జరిగిన మహిళల కబడ్డీ ప్రపంచ కప్ 2025 ఫైనల్ మ్యాచ్ ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేసింది. టైటిల్ కోసం భారత్ అజేయంగా ఫైనల్కు చేరుకున్నచైనీస్ తైపీ జట్టుతో తలబడింది. భారత్ గ్రూప్ దశలోని అన్ని నాలుగు మ్యాచ్లలో తిరుగులేని విజయం సాధించింది. సెమీ-ఫైనల్లో పటిష్టమైన ఇరాన్ను 33-21 తేడాతో ఓడించి ఫైనల్కు చేరుకుంది. ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్లో భారత మహిళల జట్టు 35-28 స్కోరు తేడాతో చైనీస్ తైపీని ఓడించి విజేతగా నిలిచింది. ఈ విజయంతో భారత మహిళా కబడ్డీ జట్టు వరుసగా రెండోసారి మహిళల కబడ్డీ ప్రపంచ కప్ టైటిల్ను గెలుచుకున్న ఘనత సాధించింది.

ప్రారంభంలో చైనీస్ తైపీ రైడర్లు భారత డిఫెన్స్కు గట్టి సవాలు విసిరినప్పటికీ.. అనుభవం, క్రమశిక్షణతో కూడిన భారత జట్టు తమ డిఫెన్స్ (టాకిల్స్) మరియు రైడింగ్ విభాగాల్లో అద్భుతమైన సమతుల్యతను ప్రదర్శించింది. ముఖ్యంగా కీలకమైన సమయాల్లో సంయమనం పాటిస్తూ, పాయింట్లను సాధించి విజయాన్ని ఖాయం చేసుకుంది. ఈసారి ప్రపంచ కప్లో మొత్తం 11 దేశాలు పాల్గొనడం, కబడ్డీ క్రీడ అంతర్జాతీయ విస్తరణకు నిదర్శనంగా నిలుస్తోంది.
ప్రథాని అభినందనలు
భారత మహిళల కబడ్డీ జట్టు కబడ్డీ ప్రపంచ కప్ 2025ను గెలుచుకుని దేశానికి గర్వకారణంగా నిలిచిన సందర్భంగా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వారికి అభినందనలు తెలిపారు. "కబడ్డీ వరల్డ్ కప్ 2025ను గెలుచుకుని దేశ గౌరవాన్ని పెంచిన మన భారత మహిళల కబడ్డీ జట్టుకు హృదయపూర్వక అభినందనలు!" అని ప్రధాని శుభాకాంక్షలు తెలియజేశారు. అంతేకాకుండా, జట్టు సభ్యులు ప్రదర్శించిన అద్భుతమైన క్రీడా స్ఫూర్తిని ఆయన ప్రత్యేకంగా కొనియాడారు.
హ్యాట్రిక్ విజయాల పరంపర వివరాలు:
కేవలం 30 రోజుల వ్యవధిలో భారతీయ మహిళా క్రీడాకారిణులు సాధించిన మూడు ప్రపంచ స్థాయి విజయాలు ఇక్కడ వివరంగా ఉన్నాయి:
మహిళల క్రికెట్ ప్రపంచ కప్: మొదటగా భారత మహిళల క్రికెట్ జట్టు దక్షిణాఫ్రికాను ఓడించి మహిళల క్రికెట్ ప్రపంచ కప్ టైటిల్ను గెలుచుకుంది.
అంధుల మహిళా T20 ప్రపంచ కప్: ఆ తర్వాత అంధుల మహిళా T20 ప్రపంచ కప్లో భారత అంధ మహిళల క్రికెట్ జట్టు అద్భుతం చేసింది. వారు కొలంబోలో జరిగిన ఫైనల్లో నేపాల్ను 7 వికెట్ల తేడాతో ఓడించి, తొలిసారి నిర్వహించిన అంధుల మహిళా T20 ప్రపంచ కప్ టైటిల్ను కైవసం చేసుకున్నారు.
మహిళా కబడ్డీ ప్రపంచ కప్: ఇప్పుడు భారత మహిళల కబడ్డీ జట్టు కూడా ప్రపంచ కప్ను గెలుచుకుంది.