ప్రో కబడ్డీ లీగ్ సీజన్-11లో ప్లేఆఫ్స్కు చేరిన తొలి జట్టుగా హర్యానా స్టీలర్స్ నిలిచింది. బుధవారం బెంగళూరు బుల్స్పై ఘన విజయం సాధించి ప్లేఆఫ్స్కు అర్హత సాధించింది. పుణె వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో హర్యానా 37-26 పాయింట్ల తేడాతో నెగ్గింది. ఈ సీజన్లో 19 మ్యాచ్లు ఆడిన హర్యానా 15 విజయాలు, 4 ఓటములు చవిచూసింది. 77 పాయింట్లతో టేబుల్ టాపర్గా కొనసాగుతోంది. మరోవైపు 18 మ్యాచ్ల్లో రెండే విజయాలతో బెంగళూరు పట్టికలో అట్టుడుగున నిలిచింది.
తొలి అర్ధభాగంలో బెంగళూరుపై హర్యానా 15-11తో పైచేయి సాధించింది. రెండో అర్ధభాగంలో దూకుడు పెంచి బెంగళూరు బుల్స్ను ఒక్కసారి ఆలౌట్ చేసింది. రైడింగ్, ట్యాకిల్లో సత్తాచాటి మ్యాచ్ను ముగించింది. హర్యానా స్టీలర్స్లో వినయ్ 9, శివమ్ 8 పాయింట్లతో సత్తాచాటారు. బెంగళూరు జట్టులో 5 పాయింట్లు సాధించిన జతిన్ టాప్ స్కోరర్. పుణె వేదికగా జరిగిన మరో మ్యాచ్లో తమిళ్ తలైవాస్పై యు ముంబా 47-31 పాయింట్లతో ఘన విజయం సాధించింది.

అజిత్ చౌహాన్ 10 పాయింట్లు, అమిర్ మహ్మద్ 9, మంజీత్ 8 పాయింట్లతో విజయంలో కీలక పాత్ర పోషించారు. తమిళ్ తలైవాస్ జట్టులో మొయిన్ 10 పాయింట్లతో పోరాడాడు. మ్యాచ్ ఆరంభం నుంచే తలైవాస్పై యు ముంబా పైచేయి సాధించింది. తొలి అర్ధభాగంలో 22-14 పాయింట్లతో ఆధిక్యంలో నిలిచింది. తలైవాస్ను యు ముంబా రెండు సార్లు ఆలౌట్ చేయగా, ముంబాను తలైవాస్ ఒక్కసారి ఆలౌట్ చేసింది.
సెకండ్ హాఫ్లో యు ముంబా మరింత జోరు పెంచింది. తమిళ్ తలైవాస్ను మరోసారి ఆలౌట్ చేసి భారీ ఆధిక్యం సాధించి మ్యాచ్ను కైవసం చేసుకుంది. కాగా, ఇవాళ పుణె వేదికగా రాత్రి 8 గంటలకు దబాంగ్ ఢిల్లీతో తెలుగు టైటాన్స్, రాత్రి 9 గంటలకు యూపీ యోధాస్తో బెంగాల్ వారియర్స్ తలపడనున్నాయి.