హైదరాబాద్: కబడ్డీ వరల్డ్ కప్లో భారత్ మూడోసారి ఛాంపియన్గా నిలిచింది. అహ్మదాబాద్లో శనివారం రాత్రి జరిగిన ఫైనల్స్లో ఇరాన్పై భారత్ 9 పాయింట్ల తేడాతో విజయం సాధించింది. ప్రథమార్ధంలో 13-18 తేడాతో భారత్ వెనుకబడి ఉన్నా.. ద్వితీయార్ధంలో మాత్రం భారత ఆటగాళ్లు చెలరేగి ఆడారు.
ముఖ్యంగా భారత ఆటగాళ్లు ఆచితూచి ఆడుతూ పాయింట్లు రాబట్టారు. భారత డిఫెండర్లు, రైడర్లు సమష్టిగా రాణించడంతో 38-29 తేడాతో చివరకు మ్యాచ్లో విజయం సాధించింది. ముఖ్యంగా అజయ్ ఠాకూర్ వన్ మ్యాన్ షో... భారత్ను విశ్వవిజేతగా నిలపడంలో కీలకపాత్ర పోషించాడు.

దీంతో 2002, 2007లో భారత్ వరల్డ్ కప్ గెలుచుకోగా 2016లో కూడా భారత్ ఛాంపియన్గా అవతరించింది. ఆట ప్రారంభం నుంచే ఇరుజట్ల మధ్య మ్యాచ్ హోరాహోరీగా సాగింది. ఒక దశలో ఇరాన్ 10-07పాయింట్లతో లీడ్ లోకి వెళ్లగా ఓ సూపర్ టాకిల్తో భారత్ ఆటగాళ్లు ఫామ్ లోకి వచ్చారు.
దీంతో ఆట మొదటి అర్ధభాగం ముగిసే సరికి ఇరాన్ జట్టు వరుస రైడ్లలో భారత ఆటగాళ్లను అలౌట్ చేసి 18-13 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ద్వితీయార్ధంలో భారత ఆటగాళ్లు ఇరాన్ పై ఎదురుదాడికి దిగి 21-20తో ఆధిక్యం సంపాదించారు. భారత ఆటగాళ్లలో అజయ్ ఠాకూర్ ఏడు రైడింగ్ పాయింట్లు సాధించాడు.
దీంతో పాటు ఇరాన్ను అలౌట్ చేసి భారత ఆధిక్యాన్ని 24-21కి తీసుకెళ్లాడు. ఆ తర్వాత రైడింగ్కు వచ్చిన ఇరాన్ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వకుండా భారత ఆటగాళ్లు ఆధిక్యాన్ని 27-21కి పెంచి మ్యాచ్ పై పట్టు సాధించారు. పాయింట్లను తెచ్చే క్రమంలో ఇరాన్ ఆటగాళ్లు విఫలమవ్వడంతో పాటు అలౌట్ అయ్యారు.
దీంతో భారత్ ఆధిక్యం 34-24కు పెరిగింది. ఇలా అజయ్ ఠాకూర్ మ్యాచ్ మొత్తం మీద 10కి పైగా రైడ్ పాయింట్లు సాధించడం విశేషం. తోమర్ కూడా ఐదు రైడ్ పాయింట్లు సాధించాడు. ఆఖరి రెండు నిమిషాల్లో రైడింగ్ వెళ్లిన ఇరాన్ ఆటగాడు మీరాజ్ మెరుపు విన్యాసంతో రెండు పాయింట్లు సాధించాడు.
చివర్లో ఇరాన్ ఆటగాళ్లు ప్రయత్నించినా లాభం లేకపోయింది. దీంతో ఇరాన్పై 38-29 తేడాతో భారత్ విశ్వవిజేతగా నిలిచింది. కాగా కబడ్డీ వరల్డ్ కప్ టోర్నీలో అత్యధిక రైడింగ్ పాయింట్లు సాధించిన ఆటగాడిగా భారత్కు చెందిన అజయ్ ఠాకూర్ నిలిచాడు.