ప్రోకబడ్డీ ప్రీమియర్ లీగ్(పీకేఎల్) సీజన్- 11లో బెంగళూరు బుల్స్ ఎట్టకేలకు బోణీ కొట్టింది. హైదరాబాద్లోని గచ్చిబౌలి స్టేడియంలో మంగళవారం దబాంగ్ ఢిల్లీతో జరిగిన మ్యాచ్లో 34-33 పాయింట్ల తేడాతో విజయం సాధించింది. ఈ సీజన్లో ఇప్పటివరకు అయిదు మ్యాచ్లు ఆడిన బెంగళూరు బుల్స్ ఎట్టకేలకు విజయాన్ని అందుకుని ఖాతా తెరిచింది. ఆరు పాయింట్లతో పట్టికలో అట్టడుగు స్థానంలో ఉంది.
ఈ పోరులో బెంగళూరు అద్భుతంగా పోరాడింది. తొలి అర్ధభాగంలో పేలవమైన ఆట తీరు కనబర్చిన బెంగళూరు విజయం సాధిస్తుందని ఎవరూ ఊహించలేదు. కానీ గొప్పగా పుంజుకుని ఒక్క పాయింట్ తేడాతో గెలుపు రుచి చూసింది. ఫస్ట్ హాఫ్లో బెంగళూరు బుల్స్ 14-22తో వెనుకపడింది. ఢిల్లీ చేతిలో ఒక్కసారి ఆలౌట్ కూడా అయ్యింది. డిఫెండర్లు సత్తాచాటలేకపోయారు.

కానీ సెకండ్ హాఫ్లో బెంగళూరు బుల్స్ గొప్ప ప్రదర్శన చేసింది. రైడింగ్, ట్యాకిల్స్తో పాయింట్లతో హోరెత్తించింది. దబాంగ్ ఢిల్లీని ఒక్కసారి ఆలౌట్ చేసి 20-11తో పైచేయి సాధించింది. బెంగళూరు జట్టులో ప్రదీప్ నర్వాల్ (7), నితిన్ రావల్ (5) సత్తాచాటారు.ఢిల్లీ జట్టులో అషు మలిక్ (13) పోరాడాడు.
అంతకుముందు జరిగిన మరో మ్యాచ్ బెంగాల్ వారియర్స్ వర్సెస్ పుణెరి పల్టాన్ టైగా మారింది. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్లో ఇరు జట్లు 32-32 పాయింట్లు సాధించాయి. తొలి అర్ధభాగంలో పుణెరి పైచేయి సాధించింది. బెంగాల్ కంటే మూడు పాయింట్ల ఆధిక్యంలో ఉంది. కానీ అదే జోరును సెకండ్ హాఫ్లో కొనసాగించలేకపోయింది.
బెంగాల్ జట్టులో సుశీల్ (10), నితీన్ (6) సత్తాచాటారు. పుణెరి టీమ్లో ఆకాశ్ (8) రాణించాడు. కాగా, ఇవాళ రాత్రి 8 గంటలకు గుజరాత్ జెయింట్స్తో తమిళ్ తలైవాస్, రాత్రి 9 గంటలకు యూపీ యోధాస్తో హర్యానా స్టీలర్స్ తలపడనున్నాయి.