హైదరాబాద్: ఇండోనేషియా రాజధాని జకార్తా వేదికగా జరుగుతున్న 18వ ఆసియా గేమ్స్లో భారత కబడ్డీ జట్టు నిరాశపరిచింది. కబడ్డీలో 28 ఏళ్ల తర్వాత తొలిసారి స్వర్ణం కోసం మ్యాచ్ ఆడకుండానే భారత జట్టు ఇంటిదారి పట్టింది. ఈ ఆసియా గేమ్స్లో డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగిన భారత కబడ్డీ జట్టు కాంస్యంతో సరిపెట్టుకుంది. సెమీఫైనల్లో భాగంగా ఇరాన్తో జరిగిన పోరుతో భారత కబడ్డీ జట్టు 27-18తేడాతో ఓడిపోయింది.
ఇరాన్ జట్టు ఆటగాళ్లు డిఫెన్స్లో తమకు తిరుగులేదని మరోసారి నిరూపించారు. సెమీపైనల్లో తొలుత భారత జట్టే ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. వరుస పాయింట్లు సాధించి 5-1తో ఆధిక్యంలో నిలిచారు. ఆ తర్వాత అనూహ్యంగా పుంజుకున్న ఇరాన్ చక్కని సూపర్ ట్యాకిల్తో 8-8తో స్కోరు సమం చేసింది.
ఆ తర్వాత భారత్ 11-9తో ముందంజ వేసింది. ఈ క్రమంలో వరుసగా మూడు పాయింట్లు సాధించిన ఇరాన్ 14-11తో ఆధిక్యంలోకి వెళ్లింది. అక్కడ నుంచి ఆ జట్టు దూకుడుగా ఆడింది. 16-12, 20-14 పాయింట్లతో దూసుకుపోయింది. చివర్లో భారత్ను ఆలౌట్ చేసి 27-17 పాయింట్ల తేడాతో విజయం సాధించింది.
ఆసియా గేమ్స్లోనే తొలిసారి: సెమీస్లో ఓడిన భారత కబడ్డీ జట్టు, కాంస్యంతో సరి#AsianGames #Kabbadi #AsianGames2018 pic.twitter.com/DFXuBBxkRk
— MyKhel Telugu (@myKhelTelugu) August 23, 2018
సెమీస్లో భారత ఫేవరెట్ ఆటగాళ్లు పర్దీప్ నర్వాల్, మోనూ గోయత్ పూర్తిగా విఫలమయ్యారు. భారత్పై గెలిచిన ఇరాన్ జట్టు ఫైనల్లో దక్షిణ కొరియాతో తలపడనుంది. దీంతో ఆసియా గేమ్స్ ప్రారంభమైన తర్వాత కబడ్డీ పోటీల్లో భారత్ ఫైనల్కు చేరకుండా ఉండటం ఇదే తొలిసారి. స్వర్ణం సాధించకుండా భారత పురుషుల కబడ్డీ జట్టు ఇంటికి రావడం కూడా ఇదే తొలిసారి.
ఆసియా గేమ్స్లో భారత్ తప్పకుండా స్వర్ణ పతకం సాధిస్తుందన్న క్రీడలో కబడ్డీ ఒకటి. ఆసియా గేమ్స్లో భారత పురుషుల జట్టు ఏడు సార్లు స్వర్ణాన్ని కైవసం చేసుకుంది. అంతేకాదు ఈ గేమ్స్లో భారత పురుషుల కబడ్డీ జట్టుకు అద్భుతమైన రికార్డు కూడా ఉంది. ఆలాంటి కబడ్డీలో సెమీఫైనల్లో భారత్ ఓటమి అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది.
లీగ్ స్టేజిలో దక్షిణ కొరియాతో జరిగిన మ్యాచ్లో భారత జట్టు 23-24తేడాతో ఓటమి పాలైంది. అయితే, ఆ తర్వాత గ్రూప్-ఏలో థాయిలాండ్తో జరిగిన గ్రూప్ స్టేజి చివరి మ్యాచ్లో 49-30 పాయింట్ల తేడాతో అద్భుతంగా పుంజుకుని సెమీస్లోకి అడుగుపెట్టింది. దక్షిణ కొరియా చేతిలో ఓటమికి ముందు లీగ్ స్టేజిలో బంగ్లాదేశ్పై 50-21, శ్రీలంకపై 44-28తేడాతో విజయం సాధించింది.
తాజా పతకంతో ఆసియా గేమ్స్లో భారత పతకాల సంఖ్య 18కు చేరింది. ఇదిలా ఉంటే, భారత మహిళల కబడ్డీ జట్టు మాత్రం వరుసగా మూడో సారి ఆసియా గేమ్స్ ఫైనల్లో అడుగుపెట్టింది. సెమీస్లో చైనీస్ తైపీని 27-14 తేడాతో చిత్తుగా ఓడించింది. గత రెండు పర్యాయాల్లో ఆసియా క్రీడల విజేత భారతే కావడం గమనార్హం.
2012, 2013, 2014లో కబడ్డీ ప్రపంచకప్ గెలిచిన మహిళల జట్టు ఆసియా గేమ్స్లో దూసుకుపోతోంది. గ్రూప్-ఏలో అగ్రస్థానంలో నిలిచి సెమీస్కు అర్హత సాధించింది. ఇరాన్, థాయ్లాండ్ తలపడే సెమీస్లో గెలిచిన జట్టుతో భారత్ పసిడిపోరులో తలపడనుంది.