
డబ్లిన్: అంతర్జాతీయ క్రికెట్లో మరో సంచలన విజయం నమోదు అయ్యింది. క్రికెట్ పసికూన ఐర్లాండ్ బలమైన దక్షిణాఫ్రికా జట్టుపై 43 పరుగుల తేడాతో విజయం సాధించింది. డబ్లిన్లోని ది విలేజ్లో జరిగిన రెండవ వన్డే మ్యాచ్లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది సౌతాఫ్రికా. ఐర్లాండ్ ఓపెనర్లలో పాల్ స్టర్లింగ్ కాస్త నెమ్మదిగా ఆడగా... మరో ఓపెనర్ ఆండీ బాల్బిరైన్ మాత్రం దూకుడును ప్రదర్శించాడు. పాల్ స్టర్లింగ్ 44 బంతుల్లో 27 పరుగులు చేసి మహారాజ్ వేసిన అద్భుత బంతికి క్లీన్ బౌల్డ్ అయ్యాడు.
అనంతరం ఆండీ బాల్బిరైన్ అద్భుతమైన ఆటతో అందరినీ ఆకట్టుకున్నాడు. మొత్తం 117 బంతులు ఆడిన ఆండీ బాల్బిరైన్ 10 ఫోర్లు, 2 సిక్సులతో 102 పరుగులు చేశాడు. ఇక ఆ తర్వాత వచ్చిన హారీ టెక్టార్ కూడా ఆకట్టుకున్నాడు. 68 బంతుల్లో టెక్టార్ 79 పరుగులు చేసి ఔటయ్యాడు. చివరిలో జార్జ్ డాక్రెల్ 23 బంతుల్లో 45 పరుగులతో రెచ్చిపోవడంతో నిర్ణీత 50 ఓవర్లలో ఐర్లాండ్ జట్టు 5 వికెట్ల నష్టానికి 290 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా బౌలర్లలో రబాడా 58 పరుగులు ఇచ్చి 1 వికెట్ తీయగా... ఆండైల్ ఫెహులూక్వాయో 73 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీశాడు. కేశవ్ మహారాజ్, తబ్రైజ్ శంషీలు చెరో వికెట్ తీశారు.

అయితే ఐర్లాండ్ జట్టే కదా సునాయాసంగా విజయం సాధించొచ్చని భావించిన సౌతాఫ్రికా జట్టుకు ఐర్లాండ్ బౌలర్లు చుక్కలు చూపించారు. ప్రొటీస్ బ్యాట్స్మెన్లలో ఓపెన్ జాన్మాన్ మలాన్ మాత్రమే 84 పరుగులు చేసి ఆకట్టుకోగా... రస్సీ వాన్ డర్ డుస్సేన్ 49 పరుగులు చేసి ఫర్వాలేదనిపించాడు. అయితే ఐర్లాండ్ బౌలర్లను ఎదుర్కోవడంతో దక్షిణాఫ్రికా బ్యాట్స్మెన్ చాలా ఇబ్బంది పడ్డట్టు కనిపించారు. ఎవరూ నిలకడగా క్రీజులో నిలవలేకపోయారు. వచ్చినవారు వచ్చినట్టే పెవీలియన్ బాట పట్టారు. ఐదవ ఓవర్లోనే దక్షిణాఫ్రికా తొలి వికెట్ పడింది. ఓపెనర్ మార్క్రమ్ కేవలం 5 పరుగులకే ఔటై పెవీలియన్ బాట పట్టాడు.
ఇలా ఒక్కొక్క బ్యాట్స్మెన్ వచ్చినట్లే వచ్చి పెవీలియన్కు క్యూకట్టడంతో 48.3 ఓవర్లలో సౌతాఫ్రికా దుకాణం కట్టేసింది. దీంతో ఆతిథ్య ఐర్లాండ్ జట్టు 43 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఐర్లాండ్ బౌలర్లలో మారక్ అడైర్,జోష్ లిటిల్, ఆండీ మెక్బ్రైన్లు చెరో రెండు వికెట్లు తీయగా... క్రెయిగ్ యంగ్, సిమి సింగ్, జార్జ్ డాక్రెల్లు ఒక్కో వికెట్ తీశారు. ఇక మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు సెంచరీతో కదం తొక్కిన ఐర్లాండ్ బ్యాట్స్మెన్ ఆండీ బాల్బిరైన్ను వరించింది.