
హైదరాబాద్: ప్రపంచకప్లో 44 ఏళ్ల తర్వాత తొలిసారి సెమీస్ చేరిన జట్టుగా చరిత్ర సృష్టించేందుకు భారత మహిళల హాకీ జట్టు సిద్ధమైంది. ఇందుకోసం భారత అమ్మాయిలు అభిమానుల నుంచి మద్దతు కావాలని కోరుతున్నారు. క్వార్టర్స్లో భాగంగా గురువారం ఐర్లాండ్తో భారత్ తలపడనుంది. ఈ మ్యాచ్ గెలిస్తే భారత్ సెమీస్ చేరుతోంది. ఈ నేపథ్యంలో భారత జట్టు కెప్టెన్ రాణి రాంపాల్ సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులు తమకు మద్దతివ్వాలని కోరింది. ఇందుకు సంబంధించిన వీడియోను హాకీ ఇండియా ట్విట్టర్ ద్వారా పంచుకుంది.
'ప్రపంచకప్లో భారత మహిళల జట్టు క్వార్టర్స్ చేరింది. మీ అందరి మద్దతుతోనే ఇది సాధించాం. టోర్నీలో భాగంగా గురువారం క్వార్టర్స్లో ఐర్లాండ్తో తలపడనున్నాం. భారత కాలమానం ప్రకారం గురువారం రాత్రి 10.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. దయచేసి మీరంతా మ్యాచ్ చూసి తద్వారా మమ్మల్ని పోత్సహించండి' అని రాణి వీడియో సందేశం ద్వారా భారత అభిమానులను కోరింది.
భారత మహిళల జట్టు ఇది వరకు 1974 ప్రపంచకప్లో మాత్రమే సెమీస్ చేరింది. గ్రూప్ దశలో ఐర్లాండ్ చేతిలో ఎదురైన పరాజయానికి ప్రతీకారం తీర్చుకుని సెమీస్ చేరాలని భారత జట్టు పట్టుదలతో ఉంది. కొద్ది రోజుల క్రితం భారత ఫుట్బాల్ కెప్టెన్ సునీల్ ఛెత్రి కూడా మైదానాలకు వచ్చి తాము ఆడే మ్యాచ్లను చూసి ప్రోత్సహించాలని స్టేడియంలో ఉండే భారత వాసులను కోరాడు. అతనికి మద్ధతుగా కోహ్లీ లాంటి దిగ్గజాలు సైతం నిలవడంతో విశేషాదరణ లభించింది.
పైగా, భారత మహిళల హాకీ జట్టుకు చరిత్ర సృష్టించేందుకు ఉన్న మంచి అవకాశమిది. 44 ఏళ్ల తర్వాత తొలిసారి ప్రపంచకప్ సెమీస్ చేరిన జట్టుగా నిలిచేందుకు భారత అమ్మాయిలకు కావాల్సింది ఒక విజయం. గురువారం క్వార్టర్స్లో ఐర్లాండ్తో భారత్ తలపడనుంది. ఈ మ్యాచ్లో నెగ్గి సెమీస్ చేరడమే కాకుండా గ్రూప్ దశలో ఐర్లాండ్ చేతిలో ఎదురైన పరాజయానికి ప్రతీకారం తీర్చుకోవాలనే పట్టుదలతో భారత్ ఉంది. టోర్నీ ఆరంభంలో పెద్దగా ప్రభావం చూపని భారత అమ్మాయిలు ఇటలీతో ప్లేఆఫ్ మ్యాచ్లో సత్తాచాటి తిరిగి ఫామ్లోకి రావడం శుభపరిణామం.