హైదరాబాద్: భారత మహిళా హాకీ జట్టు ప్లేయర్ జ్యోతి గుప్తా(20) అనుమానాస్పద రీతిలో ప్రాణాలు కోల్పోయింది. హర్యానాకు చెందిన జ్యోతి గుప్తా బుధవారం రాత్రి రేవారి స్టేషన్కు సమీపంలో రైలుకు ఎదురుగా వెళ్లి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
హర్యనాలోని సోనిపేట్కు చెందిన జ్యోతి ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని ఆమె కుటుంబ సభ్యులు చెబుతున్నారు. వివరాల్లోకి వెళితే... సర్టిఫికేట్లో తన పేరు స్పెల్లింగ్ మార్చుకునేందుకు గానూ మహర్షి దయానంద్ యూనివర్సిటీ(రోహతక్)కి వెళతానని చెప్పి బుధవారం ఉదయం జ్యోతి ఇంటి నుంచి బయల్దేరింది.
అదే రోజు సాయంత్రం ఇంట్లోవాళ్లకు ఫోన్ చేసి తాను ప్రయాణిస్తున్న బస్సు బ్రేక్ డౌన్ అయిందని రావడానికి ఆలస్యం అవుతుందని తెలిపింది. అయితే రాత్రి కావస్తున్నా జ్యోతి ఇంటికి చేరుకోకపోవడంతో కుటుంబసభ్యులు ఆమె మొబైల్కు పదే పదే ఫోన్ చేశారు.

అటునుంటి ఎలాంటి స్పందన రాలేదు. ఆ మరుసటి రోజు ఉదయం జ్యోతి మృతదేహాన్ని రేవారి రైల్వే స్టేషన్ సమీపంలో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బుధవారం రాత్రి రేవారి రైల్వే ష్టేషన్కు వచ్చిన జ్యోతి.. వేగంగా వస్తోన్న రైలుకు ఎదురుగా పరుగెత్తడంతో అక్కడికక్కడే చనిపోయింది.
స్థానికులు సమాచారం మేరకు అక్కడికి చేరుకున్న పోలీసులు మృతదేహం పక్కనే రింగ్ అవుతోన్న ఫోన్ను తీసి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు. జ్యోతి తనంతట తానే రైలుకు ఎదురుగా వచ్చినట్లు లోకోపైలట్ చెప్పినట్లు పోలీసులు పేర్కొన్నారు.
జ్యోతి ఆత్మహత్యపై అనుమానాలు వ్యక్తం చేసినప్పటికీ పోలీసులకు ఫిర్యాదు చేయకుండానే కుటుంబ సభ్యులు ఆమె మృతదేహాన్ని తీసుకెళ్లారు. దీంతో ఈ ఘటనపై ఎలాంటి కేసు నమోదు చేయలేదని రేవారి పోలీసులు తెలిపారు.
జ్యోతి గుప్తా భారత మహిళా హాకీ జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించడంతో పాటు ఆసియా గేమ్స్, పలు జాతీయ స్థాయి టోర్నీల్లో సత్తా చాటింది. వచ్చే వారం బెంగళూరులో ప్రారంభం కానున్న ట్రైనింగ్ క్యాంప్కు వెళ్లేందుకు సమాయత్తం అవుతోన్న సమయంలో ఇలా జరగడం అందరిని విషాదంలోకి నెట్టిందని ఆమె కోచ్ తెలిపారు.