న్యూఢిల్లీ: హాకీ ఇండియా ప్రధాన కార్యాలయంలో ఇద్దరు ఉద్యోగులకు కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ప్రధాన కార్యాలయాన్ని 14 రోజుల పాటు మూసివేయాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఇద్దరు ఉద్యోగుల్లో ఒకరు అకౌంట్ల విభాగంలో పని చేస్తుండగా.. మరొకరు జూనియర్ ఫీల్డ్ అఫీసర్ అని సమాచారం తెలుస్తోంది. వీరిద్దరిని ఢిల్లీ ప్రభుత్వ నిబంధనల ప్రకారం హోమ్ క్వారంటైన్లో ఉంచామని తెలిపారు.
విదేశీ స్టార్లు లేకుండా ఐపీఎల్ నిర్వహించొద్దు: నెస్ వాడియా
కరోనా వైరస్ కారణంగా నేషనల్ స్పోర్ట్స్ ఫెడరేషన్లు, ఒలింపిక్ అసోసియేషన్లుతో పాటు ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ ఉద్యోగులు అందరికీ కరోనా పరీక్షలు నిర్వహించాలని ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు నరిందర్ బత్రా ఆదేశించారు. పరీక్షల ఫలితాలు వచ్చే వరకూ ప్రతీ ఉద్యోగి ఇంటి నుంచే పని చేయాలని ఆయన స్పష్టం చేసారు.
కరోనా సోకినట్లు నిర్ధారణ జరిగిన ఇద్దరు ఉద్యోగులకు ఆదివారం మరోసారి పరీక్షలు నిర్వహిస్తామని హాకీ ఇండియా అధ్యక్షుడు ముస్తాక్ అహ్మద్ వెల్లడించారు. 'హాకీ ఇండియా ప్రధాన కార్యాలయంలోని ఉద్యోగులు, సిబ్బందిని ఆలస్యం చేయకుండా పరీక్షించమని కోరాం. అందరూ ఇంటి నుంచే పని చేయాలని ఆదేశించాం' అని నరిందర్ బత్రా ఒక మీడియా ప్రకటనలో తెలిపారు.
'క్రీడా రంగాలకు చెందిన కార్యాలయ సిబ్బందికి కూడా పరీక్షలు నిర్వహించాల్సిందే. అప్పుడే అథ్లెట్లకు నమ్మకం కలుగుతుంది' అని బాత్రా తెలిపారు. హాకీ ఇండియా కార్యాలయాన్ని 14 రోజుల పాటు మూసివేస్తున్నట్లు.. అత్యవసర సేవల విభాగంలో పనిచేసేవారు ఇంటి నుంచే విధులు నిర్వర్తించాల్సిందిగా హాకీ ఇండియా (హెచ్ఐ) ఒక ప్రకటనలో పేర్కొంది.