ఆసీస్ ఇచ్చిన షాక్ నుంచి..
తొలి మ్యాచ్లో న్యూజిలాండ్ జట్టును మట్టి కరిపించింది హాకీ ఇండియా. గ్రూప్-ఎ విభాగంలో ఈ రెండు జట్లు తలపడ్దాయి. 3-2 గోల్స్ తేడాతో భారత్ విజయాన్ని కైవసం చేసుకుంది. ఆస్ట్రేలియాతో జరిగిన రెండో మ్యాచ్లో ఘోరంగా ఓటమి పాలైంది. 1-7 గోల్స్ తేడాతో దారుణ పరాజయాన్ని చవి చూసింది. ఆసీస్ ఇచ్చిన షాక్ నుంచి త్వరగానే కోలుకుంది హాకీ ఇండియా. లోపాలను సరిదిద్దుకుంది. పక్కా వ్యూహాలను రచించుకుంది. మూడో మ్యాచ్లో మళ్లీ ఆధిపత్యాన్ని ప్రదర్శించింది.

స్పెయిన్పై అటాక్..
గ్రూప్-ఏలో జరిగిన ఈ మ్యాచ్లో స్పెయిన్పై అద్భుత విజయాన్ని అందుకుంది. 3-0 గోల్స్ తేడాతో ప్రత్యర్థిని మట్టికరిపించింది. స్పెయిన్ ప్లేయర్ల దాడిని అడ్డుకోవడంలో గోల్ కీపర్ శ్రీజేష్ కీలక పాత్ర పోషించాడు. స్పెయిన్ చేసిన గోల్ ప్రయత్నాలను విజయవంతంగా అడ్డుకున్నాడు. ఫస్ట్ హాఫ్లోనే రెండు గోల్స్ చేశారు భారత ప్లేయర్లు. సిమ్రన్జీత్ సింగ్ తొలి గోల్ చేశాడు. ఓపెన్ ప్లేలో అతను చేసిన గోల్.. ఓ అద్భుతం. కీపర్ను దాటుకుని పోస్ట్లోకి బంతిని నెట్టడంలో సిమ్రన్జీత్ తనకు తిరుగులేదని మరోసారి నిరూపించకున్నాడు. రూపిందర్ సింగ్ రెండో గోల్ సాధించాడు. పెనాల్టీ కార్నర్ను అతను సద్వినియోగం చేసుకున్నాడు.

మూడు మ్యాచుల్లో రెండు విజయాలతో..
సెకెండ్ హాఫ్లోనూ భారత్కు మరో గోల్ అందించాడు రూపీందర్ పల్ సింగ్. దీనితో ఆధిక్యత 3-0కు చేరింది. స్పెయిన్కు గోల్ చేసే అవకాశాలు లభించినప్పటికీ.. కీపర్ శ్రీజేష్ వాటిని నిలువరించగలిగాడు. పెనాల్టీ కార్నర్లను సైతం గోల్స్ మలచనివ్వలేదతను.భారత్ తప్పనిసరిగా గెలిచి తీరాల్సిన మ్యాచ్ ఇది. తదుపరి రౌండ్లలో ముందంజలో ఉండాలీ అంటే స్పెయిన్ను ఓడించి తీరాల్సిందే. అలాంటి గేమ్ను తనదైన స్టైల్లో విజయవంతంగా ముగించింది హామీ ఇండియా. మూడు మ్యాచుల్లో రెండు విజయాలతో గ్రూప్-ఏలో రెండో స్థానానికి చేరుకుంది. ఈ పాయింట్స్ టేబుల్లో ఆస్ట్రేలియా అగ్రస్థానంలో కొనసాగుతోంది. మూడుకు మూడు మ్యాచ్లను గెలిచిందీ ఆసీస్ టీమ్.


Click it and Unblock the Notifications











