సొంతగడ్డపై ప్రపంచ చాంపియన్గా నిలవాలనుకున్న భారత హాకీ జట్టు ఆశలు ఆవిరయ్యాయి. ఆదివారం నాడు న్యూజిల్యాండ్తో జరిగిన మ్యాచ్లో భారత జట్టు ఓటమి పాలైంది. దీంతో ప్రపంచ కప్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. టీమిండియా ప్లేయర్ ఆఖరి నిమిషం వరకు పోరాడినా ఫలితం లేకపోయింది. అంతకుముందు అద్భుతంగా ఆడిన భారత ఆటగాళ్లు మూడు గోల్స్ చేశారు. అయితే కివీస్ కూడా మూడు గోల్స్ చేసి గట్టి పోటీ ఇచ్చింది.
భారత ఆటగాళ్లలో లలిత్, వరుణ్, సుఖ్జీత్ తలో గోల్ చేశారు. కివీస్ కూడా మూడు గోల్స్ చేయడంతో మ్యాచ్ పెనాల్టీ షూటౌట్కు చేరింది. ఇందులోనూ ఇరుజట్లు 3-3తో నిలిచాయి. దీంతో సడెన్ డెత్ ఆడించారు. ఇందులో మొదట ఏ జట్టు ఆధిక్యంలో నిలిస్తే వారే విజేతలుగా నిలుస్తారు. ఈ క్రమంలోనే 5-4 తేడాతో ఆధిక్యం సాధించిన కివీస్.. ఈ మ్యాచ్ నెగగ్ి క్వార్టర్స్ ఫైనల్స్ చేరింది. దీంతో నాలుగున్నర దశాబ్దాల తర్వాత మరోసారి ప్రపంచకప్ ముద్దాడాలి అనుకున్న భారత జట్టు ఆశలు అడియాసలే అయ్యాయి.
ఈ మ్యాచ్లో మొదట భారత జట్టు 3-1తో ఆధిక్యంతో నిలిచింది. కివీస్ కూడా అంత సులువుగా ఓటమిని అంగీకరించలేదు. తమకు దక్కిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటూ మెరుపువేగంతో గోల్స్ చేసింది. తొలి క్వార్టర్లో అవకాశాలు వచ్చి నా రెండు జట్లూ సద్వినియోగం చేసుకోలేకపోయాయి. రెండో క్వార్టర్లో రెండు జట్లు దూకుడుగా ఆడాయి. 17వ నిమిషంలో లలిత్ తొలి గోల్ చేయడంతో భారత్ ముందంజ వేసింది. తర్వాత కాసేపటికే హర్మన్ప్రీత్ పీసీని గోల్కీపర్ అడ్డుకోగా.. గాల్లోకి లేచిన బంతిని వేగంగా స్పందించిన సుఖ్జీత్ నెట్లోకి పంపాడు. అయితే 28వ నిమిషంలో కివీస్ కూడా గోల్ సాధించడంతో భారత్ ఆధిక్యం 2-1కి తగ్గింది.
సెకండాఫ్ ఆరంభం నుంచి ఎదురు దాడికి దిగిన భారత జట్టుకు గోల్ చేసే అవకాశాలు బాగానే దొరికాయి. కానీ అన్నింటినీ టీమిండియా క్యాష్ చేసుకోలేకపోయింది. 40వ నిమిషంలో వరుణ్ అద్భుతమైన గోల్తో భారత ఆధిక్యం 3-1కి చేరింది. అయితే చివరి క్వార్టర్లో కివీస్ పుంజుకుంది. ఆ జట్టుకు లభించిన రెండు పెనాల్టీ కార్నర్లను రస్సెల్, షాన్ ఫిండ్లే గోల్స్గా మలిచారు. దీంతో 3-3తో స్కోర్లు సమం అయ్యాయి. చివర్లో 55వ నిమిషంలో హర్మన్ప్రీత్ గోల్ చేయడానికి ప్రయత్నించాడు. అతని ప్రయత్నం విఫలం అవడంతో మ్యాచ్ షూటౌట్కు దారితీసింది.