
న్యూఢిల్లీ: భారత మహిళల హాకీ జట్టు కెప్టెన్ రాణి రాంపాల్ కెరీర్లో మరో అరుదైన ఘనత చేరింది. తాజాగా కేంద్ర ప్రభుత్వ 'పద్మశ్రీ' అవార్డుకు ఎంపికైన రాణికి ఇప్పుడు క్రీడా రంగానికి సంబంధించి అంతర్జాతీయ స్థాయి పురస్కారం లభించింది. రాణి రాంపాల్కు ప్రతిష్ఠాత్మక 'వరల్డ్ గేమ్స్ అథ్లెట్ ఆఫ్ ది ఇయర్' అవార్డు 2019 దక్కింది. దీంతో ఈ అవార్డు కైవసం చేసుకున్న ప్రపంచంలోనే తొలి హాకీ ప్లేయర్గా రాణి చరిత్ర సృష్టించింది.
20 రోజుల అభిమానుల ఓటింగ్ తర్వాత ఫలితాలను వరల్డ్ గేమ్స్ గురువారం ప్రకటించింది. ఈ అవార్డు విజేత కోసం ప్రపంచవ్యాప్తంగా అభిమానులను భాగం చేస్తూ.. వరల్డ్ గేమ్స్ పోలింగ్ నిర్వహించారు. ఇందులో రాణికి మొత్తం 1,99,477 ఓట్లు పోలయ్యాయి. దీంతో 2019కు గాను రాణి 'అథ్లెట్ ఆఫ్ ది ఇయర్' అవార్డుకు ఎంపికైనట్టు వరల్డ్ గేమ్స్ వెల్లడించింది. రెండో స్థానంలో నిలిచిన ఉక్రెయిన్ కరాటే క్రీడాకారిణి స్టానిస్లావ్కు 92 వేల ఓట్లు మాత్రమే లభించాయి.
గత ఏడాది భారత హాకీ జట్టు ఎఫ్ఐహెచ్ సిరీస్ ఫైనల్స్ గెలవగా.. రాణి 'ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్'గా నిలిచింది. ఆమె నాయకత్వంలోనే భారత జట్టు టోక్యో ఒలింపిక్స్కు అర్హత సాధించింది. ఒలింపిక్స్కు అర్హత సాధించడంలో రాణి కీలకపాత్ర పోషించింది. 25 రకాల క్రీడాంశాల నుంచి ఒక్కో క్రీడా సమాఖ్య ఒక్కో ప్లేయర్ను 'వరల్డ్ గేమ్స్ అథ్లెట్ ఆఫ్ ది ఇయర్' అవార్డు కోసం నామినేట్ చేస్తుంది. 2019లో ప్రదర్శనను పరిగణలోకి తీసుకొని అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) ఈసారి రాణి పేరును ప్రతిపాదించింది. విజేతగా నిలిచిన రాణిని ఎఫ్ఐహెచ్, భారత హాకీ సమాఖ్య (హెచ్ఐ)లు ప్రశంసలతో ముంచెత్తాయి.
'ఈ అవార్డును హాకీ జట్టు, నా దేశానికి అంకితం చేస్తున్నాను. హాకీ ప్రేమికులు, అభిమానులు, నా జట్టు, కోచ్లు, హాకీ ఇండియా, నా ప్రభుత్వం, బాలీవుడ్ స్నేహితులు, దేశ ప్రజల ప్రేమ మరియు మద్దతుతో మాత్రమే ఈ విజయం సాధ్యమైంది. నాకు ఓటు వేసి గెలిపించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ప్రతిష్టాత్మక అవార్డుకు నన్ను ఎంపిక చేసినందుకు ఎఫ్ఐహెచ్కి ప్రత్యేక ధన్యవాదాలు. వరల్డ్ గేమ్స్కి రుణపడిఉంటా' అని రాణి పేర్కొంది.