హైదరాబాద్: మాడ్రిడ్ వేదికగా స్పెయిన్తో జరిగిన ఐదు మ్యాచ్ల హాకీ సిరిస్లో భారత మహిళల జట్టు అద్భుత ప్రదర్శన చేసింది. సిరీస్ను చేజార్చుకోకుండా ఉండాలంటే కచ్చితంగా గెలవాల్సిన ఐదో మ్యాచ్లో భారత్ జట్టు సమష్టిగా రాణించి 4-1 తేడాతో స్పెయిన్పై విజయం సాధించింది.
దీంతో సిరిస్ 2-2తో సమం అయింది. మాడ్రిడ్లోని కాన్సెజ్ సుపరియర్ డీ డీపోర్టీస్ హాకీ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో భారత మహిళలు ఆరంభం నుంచీ దూకుడుగా ఆడారు. మ్యాచ్ 33, 37 నిమిషాల్లో భారత కెప్టెన్ రాణి రాంపాల్ రెండు గోల్స్తో జట్టును ఆధిక్యంలో నిలిపింది.
ఆ తర్వాత గుర్జిత్ కౌర్ 44, 50 నిమిషాల్లో రెండు పెనాల్టీ కార్నర్స్ను గోల్గా మలచడంలో మ్యాచ్పై భారత జట్టు పట్టు సాధించింది. చివర్లో ఆతిథ్య జట్టు క్రీడాకారిణి లోలా రేరా 58వ నిమిషంలో గోల్ చేసినప్పటికీ స్పెయిన్కు ఓటమి తప్పలేదు. ఐదు మ్యాచ్ల సిరిస్లో తొలి మ్యాచ్లో స్పెయిన్ గెలవగా, రెండో మ్యాచ్ డ్రాగా ముగిసింది.
ఇక, మూడో మ్యాచ్లో భారత్ జట్టు గెలుపొందగా, నాలుగో మ్యాచ్లో స్పెయిన్ విజయం సాధించిన సంగతి తెలిసిందే.