PR Sreejesh: పారిస్ ఒలింపిక్స్లో భారత దేశ ప్రజల ఆశలు హాకీ జట్టుపై ఉన్నాయి. టోక్యో ఒలింపిక్స్లో కాంస్య పతకం సాధించిన టీమిండియా... ఇప్పుడు ఏకంగా పసిడి పతక సాధనే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగానే హాకీలో మేటి జట్లుగా గుర్తింపున్న ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, గ్రేట్ బ్రిటెయిన్ జట్లపై విజయం సాధించి ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళుతోంది. అయితే ఈ విజయాల్లో గోల్స్ వేసిన ఆటగాళ్ల పాత్ర ఒకటైతే భారత హాకీ జట్టు గోల్ కీపర్ పీఆర్ శ్రీజేష్ పాత్ర మరొక ఎత్తు.
పీఆర్ శ్రీజేష్..ది గోల్డెన్ వాల్..!
పీఆర్ శ్రీజేష్... భారత హాకీ జట్టుకు ఒక గోడలా నిలబడ్డాడు. ప్రత్యర్థులు బంతితో వేగంగా వచ్చి గోల్పోస్టులోకి పంపాలన్న వారి ప్రయత్నాలకు అడ్డుగోడలా నిలిచాడు. అందుకే భారత్ విజయాలతో దూసుకెళుతోంది. ప్రత్యర్థులకు చిన్న గ్యాప్ ఇవ్వకుండా బంతిని నిలువరించేందుకు సర్వం ధారపోస్తున్నాడు ఈ గోల్ కీపర్.దీంతో టీమ్లోని ఇతర సభ్యులకు స్ఫూర్తిగా నిలుస్తున్నాడు. దేశం యావత్తు శ్రీజేష్ కనబరుస్తున్న ప్రతిభకు దాసోహమైంది.

శ్రీజేష్కు చివరి ఒలింపిక్స్
భారత్ గ్రేట్ బ్రిటెయిన్ మధ్య జరిగిన క్వార్టర్స్ మ్యాచ్లో శ్రీజేష్ ప్రతిభ వావ్ అనాల్సిందే. మ్యాచ్ ఆద్యాంతం నువ్వా నేనా అన్నట్లుగా కొనసాగింది. క్వార్టర్ ఫైనల్స్ కాబట్టి ఆటగాళ్లపై ఒక్కింత ఒత్తిడి ఉంది. కానీ అది శ్రీజేష్ పై మాత్రం రెట్టింపు అయ్యింది. అయినప్పటికీ మనోడ జడవలేదు. ఒత్తిడిని అధిగమించి బంతిని ఆపడంలో తనకు తానే సాటి అని నిరూపించాడు. అదొక అద్భుతమా లేదా శ్రీజేష్ ఎనర్జీనా అది ఏదైనా కావొచ్చు.. శ్రీజేష్ మరోసారి భారత్ గెలుపులో కీలకంగా వ్యవహరించాడు.ఇది శ్రీజేష్కు చివరి ఒలింపిక్స్ కావడంతో మళ్లీ ఇలాంటి ప్రదర్శన చూసే ఛాన్స్ రాకపోవచ్చు.
నాల్గవ సారి ఒలింపిక్స్లో శ్రీజేష్ పాల్గొంటున్నారు. ఇన్నేళ్లు అతని ఫిట్నెస్ను కాపాడుకుంటూ వస్తున్నాడంటే అది మామూలు విషయం కాదు.శ్రీజేష్ ఒలింపిక్స్లో ఘనమైన విజయాలు, ఘోరమైన ఓటములు చూశాడు.2012 లండన్ ఒలింపిక్స్ డిజాస్టర్, 2016 రియో ఒలింపిక్స్ అంతంత మాత్రమే.2014 దక్షిణ కొరియాలో జరిగిన ఫైనల్ మ్యాచ్లో అద్భుతంగా రాణించాడు.ఇప్పుడు 2024లో భారత్కు శ్రీజేష్ ఇంకా సేవలందిస్తూనే ఉన్నాడు. పారిస్కు బయలు దేరే ముందు శ్రీజేష్ మాట్లాడుతూ... ప్రస్తుతం భారత హాకీ జట్టు పారిస్ ఒలింపిక్స్లో బాగా రాణిస్తుందని మాట ఇచ్చాడు.మాట ఇచ్చిన ప్రకారమే భారత్ దూసుకెళుతోంది.
విమర్శలను చిరునవ్వుతో..
ఇక శ్రీజేష్ మనస్తత్వం చాలా మంచిది. భారత హాకీ జట్టు ఓటమిపాలైనప్పుడు చాలా మంది చాలా విమర్శలు చేశారు. కానీ శ్రీజేష్ వాటన్నిటినీ చిరునవ్వుతో స్వీకరించి తిరిగి మీడియా ముందుకు వచ్చి మాట్లాడేవాడు.విలేకరుల నుంచి ఓటమిపై కఠినమైన ప్రశ్నలే ఎదుర్కొన్నాడు. కానీ సమాధానం మాత్రం చాలా స్మూత్గా ఇచ్చేవాడు.టోక్యో ఒలింపిక్స్లో భారత్ కాంస్య పతకం సాధించినప్పుడు శ్రీజేష్ సంతోషపడ్డాడు. కానీ పారిస్ ఒలింపిక్స్లో మాత్రం కచ్చితంగా బంగారు పతకం సాధించాలనే కసితో ఉన్నాడు.ఇక భారతదేశంలో హాకీ క్రీడలో ఇక్కడి ఇతర గోల్ కీపర్లకు శ్రీజేష్ ఒక సవాలుగా మారాడు.ఒక సీనియర్ ఆటగాడిగా చాలామందికి సూచనలు సలహాలు ఇస్తుంటాడు.
మొత్తానికి శ్రీజేష్ భారత జట్టుకు ఒక పెద్దన్నలా సలహాలు ఇస్తూ ఇతర ఆటగాళ్లకు స్ఫూర్తిగా నిలుస్తున్నాడు. మరో అనుభవజ్ఞుడైన ఆటగాడు మన్ప్రీత్ సింగ్తో కలిసి భారత్కు పసిడి పతకం సాధించాలనే కసితో ఉన్నారు.ఒత్తిడిని తట్టుకునే టర్ఫ్లోకి ఎంటర్ అయ్యాక తామంతా బెస్ట్ ఇస్తామని చెప్పుకొచ్చాడు ఈ గోల్డెన్ వాల్ ఆఫ్ ఇండియా.