మహిళల హాకీకీ ఊతమిచ్చేందుకు రీసెంట్ గానే ఉమెన్స్ హాకీ ఇండియా లీగ్ (డబ్ల్యూహెఐఎల్) తొలి ఎడిషన్ ను నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే ఈ లీగ్ లో ఒడిశా వారియర్స్ టీమ్ ఛాంపియన్గా అవతరించింది. తుది పోరులో జేఎస్డబ్ల్యూ సూర్మా హాకీ క్లబ్ జట్టును ఒడిశా వారియర్స్ 2-1 గోల్స్ తేడాతో ఓడించింది.
రెండు వారాల పాటు సాగిన ఈ టోర్నీలో నాలుగు ఫ్రాంఛైజీలు పోటీ పడ్డాయి. దిల్లీ ఎస్జీ పైపర్స్, ఒడిశా వారియర్స్, బెంగాల్ టైగర్స్, సూర్మా హాకీ క్లబ్ బరిలోకి దిగాయి. రాంచీలోని జైపాల్ సింగ్ హాకీ స్టేడియం వేదికగా ఈ పోటీలను నిర్వహించారు.

వీటిలో నేహా గోయల్ సారథ్యంలోని ఒడిశా వారియర్స్ - సలీమా టెటె సారథ్యంలోని సూర్మా క్లబ్ జట్టు ఫైనల్ లో తలపడ్డాయి. ఈ పోరులో పెన్నీ స్క్విబ్ 28వ నిమిషంలో ఏకైక గోల్ అందించగా.. రుతుజా దాదాసో పిసాల్ 20వ, 56వ నిమిషాల్లో రెండు గోల్స్ చేసి ఒడిశా వారియర్స్ విజయంలో కీలకంగా వ్యవహరించింది.
ఈ విజయంతో ఒడిశా వారియర్స్కు రూ. కోటి 50 లక్షల ప్రైజ్మనీని అందించారు. రన్నరప్ గా నిలిచిన సూర్మా క్లబ్కు రూ.కోటి నగదు బహుమతి ఇచ్చారు. మూడో స్థానంలో నిలిచిన బెంగాల్ టైగర్స్ జట్టుకు రూ. 50 లక్షలు అందించారు.
బెస్ట్ గోల్కీపర్ ఆఫ్ ద టోర్నీ అవార్డు సవితా పూనియాకు వరించగా.. ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు జ్యోతికి దక్కాయి. ఈ ఇద్దరూ సూర్మా హాకీ క్లబ్ కు చెందినవారే. ఒడిశా వారియర్స్కు చెందిన యిబ్బీ జాన్సెన్, సూర్మా హాకీ క్లబ్కు చెందిన చార్లోటి ఎంగ్లెబెర్ట్ టోర్నీ టాప్ స్కోరర్స్గా నిలిచారు.
మొత్తంగా ఈ లీగ్ లో 4 జట్లు పాల్గొనగా, 13 మ్యాచులు జరిగాయి. 41 గోల్స్ నమోదవ్వగా.. అందులో 27 ఫీల్డ్ గోల్స్, 11 పెనాల్టీ కార్నర్ గోల్స్ , 3 పెనాల్టీ స్ట్రోక్ గోల్స్ ఉన్నాయి. 22 మంది ప్లేయర్లకు గ్రీన్ కార్డులు,6 మంది ప్లేయర్లకు ఎల్లో కార్డులు ఇచ్చారు.