
న్యూఢిల్లీ: హాకీ ఇండియా కొత్త అధ్యక్షుడిగా మహ్మద్ ముస్తాక్ అహ్మద్ ఎన్నికయ్యారు. సోమవారం ఇక్కడ జరిగిన 8వ హాకీ ఇండియా కాంగ్రెస్ ఎన్నికల్లో ఆయన ఏకగ్రీవంగా గెలుపొందాడు. ప్రస్తుతం సంఘంలో ప్రధాన కార్యదర్శి పదవిలో ఉన్న అహ్మద్.. రాజేందర్సింగ్ వారసుడిగా పదవి బాధ్యతలు చేపట్టనున్నారు. మహమ్మద్ ముస్తాక్ అహమ్మద్ ఎంపికపై ఎలాంటి వ్యతిరేకత రాలేదని సంబంధిత అధికార వర్గాలు ఒక పత్రికా ప్రకటనలో తెలిపాయి.
కాగా, మణిపూర్ హాకీకి చెందిన జ్ఞానేంద్ర నింగోబమ్ హాకీ ఇండియా సీనియర్ వైస్ప్రెసిడెంట్గా, జమ్మూ-కాశ్మీర్కు చెందిన అసీమా అలీ, జార్ఖండ్కు చెందిన భోలా నాథ్ సింగ్ వైస్ప్రెసిడెంట్లుగా వ్యవహరిస్తారు. జమ్మూ-కాశ్మీర్కు చెందిన రాజీందర్ సింగ్ కొత్త సెక్రెటరీ జనరల్గా, అసోంకు చెందిన తపన్ కుమార్ ట్రెజరర్గా ఎన్నికయ్యారు.
మహిళల హాకీ జట్టు మాజీ కెప్టెన్ అసుంతా లక్రా, చత్తీస్గఢ్కు చెందిన ఫిరోజ్ అన్సారీ జాయింట్ సెక్రెటరీలుగా ఎన్నికయ్యారు. రాజస్తాన్కు చెందిన ఆర్తీ సింగ్, తమిళనాడుకు చెందిన ఎం.రేణుకా లక్ష్మి, ప్రస్తుతం కర్నాటక హాకీకి ప్రెసిడెంట్గా వ్యవహరిస్తున్న ఎస్వీఎస్ సుబ్రమణ్య గుప్తా ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా ఎన్నికయ్యారు. ఆర్పీ సింగ్, జొయ్దీప్ కౌర్ అథ్లెట్ల తరఫున ప్రతినిధులుగా ఎన్నికయ్యారు.
భారత హాకీ జట్టు మాజీ కోచ్ రోయ్లంట్ ఆల్టమన్స్ సోమవారం మలేషియా పురుషుల జాతీయ జట్టు కొత్త ప్రధాన కోచ్గా ఎంపికయ్యాడు. మలేషియా హాకీ కాన్ఫిడరేషన్ (ఎంహెచ్సీ) అధ్యక్షుడు దాతుక్ సేరి సుభాన్ కమల్ తమ దేశ హాకీ జట్టుకు కొత్త ప్రధాన కోచ్గా ఆల్టమన్స్ నియామకాన్ని ఇక్కడ జరిగిన మీడియా సమావేశంలో ధ్రువీకరించాడు. ఆల్టమన్స్ భారత పురుషుల హాకీ కోచ్గా వ్యవహరించిన సమయంలో గత ఏడాది జరిగిన అంతర్జాతీయ మ్యాచ్లలో జట్టును అంతగా ముందుకు తీసుకెళ్లలేకపోయాడు. దీంతో గత సెప్టెంబర్లోనే ఆయన రాజీనామా చేశాడు.